TTD గోల్డెన్ ఛాన్స్, ఒకే రోజు ఒకే టికెట్తో రెండు సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం- ఇలా చేయండి..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అన్ని కంపార్టుమెంట్ల లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కాగా, టీటీడీ శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం కల్పించింది. ఒకే రోజు రెండు సార్లు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది. వెయ్యి మంది భక్తులకు మాత్రమే ఈ వెసులుబాటు దక్కనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఈ అవకాశం ఎలా దక్కించుకోవాలో అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తిరుమలలో శ్రీవారిని ఒక్క సారి దర్శించుకుంటే చాలు. ఆ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. ఆ భక్తులకు ఒకే రోజు ఒకే టికెట్ పై రెండు సార్లు దర్శనం లభిస్తే అంతకంటే సంతోషం మరి ఏదీ ఉండదు. కాగా, ఇప్పుడు టీటీడీ అలాంటి అవకాశమే కల్పిస్తోంది. ఒకే టికెట్తో ఒకేరోజు రెండు సార్లు శ్రీవారిని దర్శించు కునే అవకాశం భక్తులకు కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది నవంబర్ 16న పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ఆర్జిత సేవకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఈ నెల 21న విడుదల చేయనుంది. టికెట్ ధర రూ.700గా నిర్ణయించారు. ఒక్క టికెట్పై గరిష్ఠంగా ఇద్దరు భక్తులు ఈ సేవ కోసం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, మొత్తం ఈ పుష్పయాగం సేవకు సుమారు వెయ్యి టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచు తారు. టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒకే రోజు రెండు సార్లు శ్రీవారి దర్శనం
కాగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్ల జరిగే అనుకోని దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజుకు టికెట్ పొందిన భక్తులు స్వామివారిని రెండు సార్లు దర్శనం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఉదయం 6గంటలకు సుపథం మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించాలి. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే అభిషేక సేవలో పాల్గొన్న అనంతరం శ్రీవారిని దర్శించుకోవచ్చు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మరోసారి సుపథం మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి.. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి నిర్వహించే పుష్పయాగ మహోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. పుష్పయాగం అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. దీని ద్వారా భక్తులకు రూ.700 టికెట్ తో భక్తులు ఒకేరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభించనుంది. అయితే.. నవంబర్ 16వ తేదీకు ముందు 180 రోజుల వ్యవధిలో ఏదైనా ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులు పుష్పయాగం టికెట్ బుక్ చేసుకునేందుకు అర్హులు కారని టీటీడీ స్పష్టం చేసింది.



Click it and Unblock the Notifications