ఢిల్లీలో కన్నాకు చేదుఅనుభవం: చిందులుతొక్కిన పవార్
అఖిలపక్షంతో పాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలు కెవిపి రామచంద్ర రావు, లగడపాటి రాజగోపాల్, కిల్లి కృపారాణి, ఉండవల్లి అరుణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అక్కడకు వచ్చిన పవార్ కన్నాను చూసి ఒక్కసారిగా రెచ్చిపోయారు. మంత్రి మారినప్పుడల్లా ఇలా వచ్చి ఎందుకు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. చెప్పాల్సింది ఒకసారి చెబితే సరిపోతుందని, రైతుల సమస్యలు తమకు తెలుసునని, ఎన్నిసార్లు కలుస్తారని, పదే పదే రావాల్సిన అవసరం లేదంటూ క్లాస్ పీకారు.
ప్రతిసారి వచ్చి ఇంత హడావుడి చేయడం అవసరమా అని ప్రశ్నించారు. వేలాపాలా లేకుండా వచ్చేస్తున్నారంటూ ఆక్రోషం వ్యక్తం చేశారు. మీ ప్రవర్తన యుద్దానికి వచ్చినట్లుగా ఉందని చిందులు తొక్కారు. మంత్రి మారినప్పుడల్లా అఖిలపక్షంతో రావడం సరికాదన్నారు. శరద్ పవార్ ఆగ్రహం చూసి కన్నా అవాక్కయ్యారు. మంత్రికి సమస్యలు చెబుతామని వస్తే ఆయనే ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల అక్కడే ఉన్న ఎంపీలు సైతం కంగు తిన్నారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తారనుకుంటే ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.