సోనియా ఆంధ్ర వర్రీ: వేడెక్కిన హస్తిన రాజకీయం
మాజీ మంత్రి పి. శంకరరావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా బొత్స సత్యనారాయణ ఢిల్లీ మకాం వేసి అధిష్టానం నేతలను వరుసగా కలిశారు. ఆయన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటనేది తెలియడం లేదు. మీడియా ప్రతినిధులు బొత్సను కలిశారు. వారితో ఆయన ఏమీ మాట్లాడలేదు. రాత్రి వరుకు ఓ బ్రేకింగ్ న్యూస్ మీకు అందుతుందని ఆయన సాధారణ రీతిలో అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన కేంద్ర మంత్రులు చిదంబరంతో, ఎకె ఆంటోనీతో సమావేశమయ్యారు. అధిష్టానం పెద్దలు రాష్ట్రానికి చెందిన కొంత మంది సీనియర్ నేతలతో రహస్య మంతనాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఢిల్లీలో పెద్ద కసరత్తే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ కసరత్తు ఏ దిశగా, ఏ అంశాలపై అనేది మాత్రం తెలియడం లేదు. నాయకత్వ మార్పుపైనా, తెలంగాణ అంశంపైనా అనేది ఎవరూ సంకేతాలు ఇవ్వలేకపోతున్నారు.
అయితే, కేవలం ధర్మాన ప్రసాద రావు వ్యవహారంపైనే కాకుండా ఇతర అంశాలపై కూడా సోనియా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, పార్టీ నాయకత్వ మార్పుపైన చర్చ జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ధర్మాన వ్యవహారాన్ని పరిష్కరించాలంటే ముఖ్యమంత్రిని మార్చి, కళంకిత మంత్రులకు బయటకు దారి చూపే అంశం కూడా ఉందని చెబుతున్నారు. లేదంటే మంత్రి వర్గ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చి, కళంకిత మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి ఆరోపణలు లేనివారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది కూడా తెలియడం లేదు.
ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ రేసులో ఉన్న నాయకుల పేర్లు కూడా ఢిల్లీలో షికార్లు చేస్తున్నాయి. మర్రి శశిధర్ రెడ్డితో పార్టీ అధిష్టానం చర్చలు జరిపినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణ అంశంపై కన్నా ఇతర విషయాలపైనే అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. అయితే, గంప గుత్తగా అన్నింటికీ ఒకేసారి పరిష్కారం చూపుతారా అనేది కూడా తెలియడం లేదు. తెలంగాణ అంశానికి, ముఖ్యమంత్రి మార్పునకు లింక్ పెడతారా అనేది కూడా తెలియడం లేదు. రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన తెలంగాణకు చెందిన ఆనంద భాస్కర్కు తెలంగాణపై మాట్లాడే అవకాశం కల్పించారు. ఆయన పూర్తిగా తెలంగాణ పక్షంగా వాదన వినిపించారు. అంటే, ఇది తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం తీసుకునే నిర్ణయానికి సంకేతమా, తెలంగాణ నాయకులను మెప్పించే ప్రయత్నమా తెలియడం లేదు. మొత్తం మీద, రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాలతో ఢిల్లీ వేడెక్కింది. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రాష్ట్ర కాంగ్రెసు నాయకుల్లో నెలకొని ఉంది.