చంద్రబాబు, విజయమ్మలకు సవాల్ విసిరిన బొత్స
చిత్తశుద్ధి, మనసు ఉంటే చంద్రబాబు, విజయమ్మ మందుకు రావాలని ఆయన అన్నారు. రాజకీయాల కోసం ఏవో ప్రకటనలు చేసినంత మాత్రాన సరిపోదని ఆయన అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికపై సీట్లు కేటాయిద్దామని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. బిసీల గురించి చంద్రబాబు, విజయమ్మ చెబుతున్న మాటల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆయన అన్నారు. నాయకత్వ మార్పు ఎందుకు ఉంటుందని ఆయన మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్న వేశారు. కొత్తవారైనా పాతవారైనా నాయకత్వం చెప్పినట్లు పనిచేయాలని ఆయన అన్నారు. తాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ అడగలేదని ఆయన తాను ఢిల్లీ వెళ్లినప్పుడు సోనియాను కలుసుకోకపోవడంపై వచ్చిన వార్తలపై అన్నారు. కుట్రలకూ కుతంత్రలకూ తాను భయపడబోనని ఆయన అన్నారు.
విద్యుత్తుపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు ఆయన జవాబిచ్చారు. ఉత్పత్తికి, డిమాండ్ కు మధ్య వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తోందని ఆయన అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం ప్రజలకు తెలియజేసిందని ఆయన అన్నారు. విద్యుత్తు అందించాలని ప్రజలు కోరడంలో తప్పు లేదని, పరిస్థితిని వివరించి అర్థం చేసుకోవాలని తాము ప్రజలను కోరుతున్నామని ఆయన అన్నారు. వివిధ పద్ధతుల్లో విద్యుత్తును తెచ్చుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం వాస్తవాలను దాచి పెట్టడం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ సోమవారం సచివాలయంలో, మంగళవారం అసెంబ్లీలో చేసిన ఆందోళన డ్రామా మాత్రమేనని, రాజకీయ ఎత్తుగడలతో కార్యక్రమాలు చేపట్టడం ప్రతిపక్షానికి తగదని ఆయన అన్నారు. ప్రజల మెప్పు కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ డ్రామాలు చేస్తోందని, ప్రజల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ప్రధానితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారని, ఎప్పటికప్పుడు కేంద్రాన్ని, విద్యుత్తు అందించే ఇతర సంస్థలను ముఖ్యమంత్రి సంప్రదిస్తూనే ఉన్నారని, అటువంటప్పుడు అఖిలపక్షాన్ని హస్తినకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ వారికున్న అవగాహనతో వారు విమర్శలు చేశారని, ముందు చూపుతో తాము వ్యవహరించినా సమస్య తలెత్తిందని, వాస్తవ పరిస్థితిని తాము వివరిస్తున్నామని ఆయన అన్నారు. వివిధ మార్గాల ద్వారా విద్యుత్తును తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు. రాజకీయాల కోసం మాట్లాడేవారు ఏదైనా మాట్లాడుతారని, కావాల్సింది అది కాదని ఆయన అన్నారు. రత్నగిరికి మళ్లించిన గ్యాస్ ను అపించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం నుంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లారని ఆయన అడిగారు.