కిరణ్ కుమార్ రెడ్డిది పైచేయి: ఆత్మరక్షణలో బొత్స?
అయితే, పరిస్థితి అంత సజావుగా లేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన ఓ లాబీని నడుపుతున్నట్లు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోమవారం బొత్స సత్యనారాయణతో ముఖ్యమంత్రిని వ్యతిరేకించే నాయకులు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో సమావేశమయ్యారు. పిసిసి అధ్యక్షుడితో పాటు ముఖ్యమంత్రిని కూడా మార్చేయాలని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే, అనూహ్యంగా అధిష్టానం నాయకత్వ మార్పు విషయంలో వెనక్కి తగ్గి, ధర్మాన ప్రసాద్ రావు రాజీనామాపై నిర్ణయాన్ని, సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మిగతా మంత్రుల పట్ల వ్యవహరించే తీరుపై నిర్ణయాన్ని ముఖ్యమంత్రికే వదిలేసినట్లు వార్తలు వచ్చాయి. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదిస్తే సంక్షోభం తప్పదనే విషయాన్ని సోనియా గాంధీకి ముఖ్యమంత్రి నమ్మబలకడం వల్లనే అలా జరిగినట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లే వరకు నాయకత్వ మార్పు తప్పదనే పరిస్థితి ఉండగా, ఆయన ఢిల్లీలో అడుగు పెట్టిన కొద్దిసేపటికి పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రి తన వాదనను బలంగా వినిపించడం వల్లనే అలా జరిగిందని అంటున్నారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించకూడదని వాదించినవారిలో బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు. పలువురు మంత్రులు బొత్స వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే వ్యక్తం చేయడంతో వారిని కాదని ధర్మాన రాజీనామాను ఆమోదిస్తే సంభవించే పరిణామాలను ఊహించి వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో అధిష్టానం వద్ద బొత్స సత్యనారాయణ పలుకుబడి తగ్గినట్లు భావిస్తున్నారు. ఆయన వ్యాఖ్య కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నట్లుగానే ఉంది. కుట్రలకూ కుతంత్రాలకూ భయపడేది లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అదే సమయంలో నాయకత్వం మార్పు ఎందుకు ఉంటుందని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. మొత్తం మీద, బొత్స సత్యనారాయణ ఆధిపత్యం కాస్తా తగ్గినట్లే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.