గనులతో గాలికి కోట్లు, దోపిడీకి ప్రధాని సహకారం: బాబు
కాగ్ నివేదికను ప్రధానమంత్రి తప్పు పట్టడం సరికాదన్నారు. ఈ నివేదికను పిఏసిలో సవాల్ చేస్తానని మన్మోహన్ చెప్పడం హాస్యాస్పదమని, కేంద్ర ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని బాబు మండిపడ్డారు. అడ్డంగా దోచుకునేందుకు ఖనిజ సంపద, సెజ్లను అక్రమార్కులు మార్గాలుగా ఎంచుకుంటున్నారని విమర్శించారు. దేశ సంపదను కొందరు వ్యక్తులు కొల్లగొడుతుంటే ప్రధాని అచేతనంగా ఉండటం విడ్డూరమన్నారు.
విదేశాలకు ఎంత డబ్బు పోయిందో చెప్పే పరిస్థితుల్లో కేంద్రం లేదన్నారు. బొగ్గు గనుల కేటాయింపులు వెంటనే రద్దు చేయాలని, జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యవస్తలను నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. కాగ్ నివేదికను తప్పు పట్టి తప్పించుకోవాలని ప్రధాని, కేంద్రం చూస్తోందన్నారు.
కాంపిటేటివ్ బిడ్డింగులను పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయని ప్రధాని చెప్పడం శోచనీయమన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి చేతకాదని చెప్పడమేమిటన్నారు. సహజ వనరులను రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. విద్యుత్ రంగం అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. ప్రముఖ సామాజి సంఘ సంస్కర్త అన్నాహజారే పార్టీ పెట్టడం తగదని అన్నారు.