గాలి బెయిల్ డీల్ రూ. 500 కోట్లతో మొదలు
కృష్ణ ప్రసాద్ గాలి జనార్దన్ రెడ్డి బంధువు దశరథరామిరెడ్డి వ్యాపార భాగస్వామి అని, కృష్ణ ప్రసాద్ వెంకటేశ్వర రావును సంప్రదించాడని, గాలి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి)లో వేల కోట్ల రూపాయలు సంపాదించారని, రూ 500 కోట్లు అయితే తప్ప బెయిల్ సాధించడం సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం.
అయితే, రూ. 100 కోట్ల రూపాయలకు డీల్ కుదిరినట్లు కృష్ణ ప్రసాద్ వాంగ్మూలాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, న్యాయమూర్తి నాగమారుతి శర్మ డీల్ను వ్యతిరేకించి, బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినట్లు చెబుతున్నారు. ఈలోగా వేరే మార్గంలో 20 కోట్ల రూపాయలకు గాలి బెయిల్ డీల్ కుదిరిందని కృష్ణ ప్రసాద్ వాంగ్మూలంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. గాలి బెయిల్ డీల్ కేసును అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) చేపట్టి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
రూ. 20 కోట్లకు డీల్ కుదుర్చుకుని గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన అప్పటి న్యాయమూర్తి పట్టాభి రామారావుతో పాటు 11 మందిని ఈ కేసులో ఎసిబి ఇప్పటికే అరెస్టు చేసింది. తాజాగా పట్టాభి రామారావు బెయిల్ పిటిషన్ను కోర్టు మంగళవారం తిరస్కరించింది. పట్టాభి రామారావు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉంటున్నారు.