పిఎం రాజీనామాకు పట్టు, బిజెపిపై సోనియా ఫైర్
మంగళవారం ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే బొగ్గు కుంభకోణంపై దుమారం చెలరేగింది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలనే తమ డిమాండ్పై బిజెపి తన పట్టు వీడలేదు. దీంతో పార్లమెంటు ఉభయ సభలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు సమావేశమైన రెండు నిమిషాలకే ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. లోకసభ, రాజ్యసభ తొలుత గంటసేపు వాయిదా పడ్డాయి.
వాయిదా తర్వాత తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రతిపక్షాలు తమ పట్టు వీడలేదు. దీంతో ఉభయ సభలూ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. రెండు సార్లు వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది.
ప్రధాని రాజీనామా చేయాలనే తమ పట్టును వీడకుండా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో స్పీకర్ మీరా కుమార్ లోకసభను గురువారంనాటికి వాయిదా వేశారు. రాజ్యసభను చైర్మన్ అన్సారీ సభను గురువారంనాటికి వాయిదా వేశారు. ఓనం కారణంగా బుధవారంనాడు పార్లమెంటు సమావేశాలు జరగడం లేదు.