మంత్రి పార్థసారథి చుట్టూ ఉచ్చు: కేసు నమోదుకు రెడీ
మంత్రి పార్థసారథిపై నాంపల్లి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు కాపీ కోసం పెనుమలూరు తహశీల్దార్ హైదరాబాద్కు బయలుదేరారు.ఎన్నికల సమయంలో ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో లోపాలున్నట్లు తేలిది. ఈ విషయాన్ని ఎన్నిక కమిషన్ నిర్ధారించి, కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. దీంతో ఆయనపై కేసు నమోదుకు రంగం సిద్ధం అవుతోంది.
విదేశీ మారకద్రవ్యం నియంత్రణ చట్టం (ఫెరా) నిబంధనలను ఉల్లంఘించిన కేసులో పార్థసారథికి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసు దాదాపు పదేళ్లనాటిది. మంత్రి బెయిల్ తీసుకుని హైకోర్టులో దానిపై అపీల్ చేసుకున్నారు. అయితే, ఈ కేసు విషయాన్ని ఆయన 2009 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో చేర్చలేదు. ఆ విషయంపై ఓ మాజీ ఐఎఎస్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో డొంక కదలి పార్థసారథి కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు.
2009 ఎన్నికలలో పార్థసారథి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్కు సమర్పించిన తన అఫిడవిట్లో పార్థసారథి తనపై కేసులు లేవని పేర్కొన్నారు. అఫిడవిట్ సమర్పించినప్పుడు కేసులు ఉంటే తప్పకుండా పేర్కొనవలసి ఉంది. కానీ పార్థసారథి మాత్రం ఈ విషయాన్ని పేర్కోలేదు.
ఇటీవల ఫెరా కేసులో నేరస్తుడిగా రుజువైన నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్లో కేసు విషయమై ప్రస్తావించక పోవడం ద్వారా ఆయన మరిన్ని చిక్కుల్లో పడ్డారని అంటున్నారు. ప్రజాప్రాతినిథ్యం చట్టం 1951 ప్రకారం ఆయనపై అనర్హత వేటుకు అవకాశముందని అంటున్నారు. ఈ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆయన ఆరేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడని చెబుతున్నారు.