మొదలే కాలేదు, రవికి తెలీదు: తెలంగాణపై సోమిరెడ్డి
సమావేశానంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై కేంద్ర మంత్రి వాయలార్ రవికి సమాచారం లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసమే రాష్ట్రం ఉద్యమం జరగడం లేదని, సమైక్య రాష్ట్రం కోసం కూడా సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో సందిగ్ధ పరిస్థితులు నెలకొనడం మంచిది కాదని, వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
చంద్రబాబుతో తమ భేటీలో తెలంగాణపై చర్చ జరగలేదని, ఢిల్లీ పర్యటన వివరాలను చంద్రబాబు వివరించారని, చంద్రబాబు తలపెట్టిన పాదయత్రపై చర్చించామని ఆయన అన్నారు. రెండు మూడు రోజుల్లో చంద్రబాబు తెలంగాణపై చర్చించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పార్టీ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, పార్టీ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ అంశంపై చర్చిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు త్వరలో స్పష్టత ఇస్తారని ఆయన చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు ఇప్పటి వరకు తన వైఖరిని వెల్లడించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఒక ప్రాంతంలో నాయకులు పర్యటించే పరిస్థితి ఉండదనే ఆలోచన నుంచి బయటపడాలని ఆయన అన్నారు. ఏ ప్రాంతంలోనైనా పర్యటించే హక్కు నాయకులకు ఉందని, ఆ హక్కును అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు.