జగన్తో ప్యాచప్ కోసం కాదు: వైయస్ డైరీపై ఆజాద్
వైయస్ జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపదను పోగేసుకున్నాడని, వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడికి అందుకు సహకరించారని కాంగ్రెసుకు చెందిన ఓ వర్గం విమర్శిస్తుండగా, మరో వర్గం వైయస్సార్ను ప్రశంసిస్తోందని, ఇటువంటి పరస్పర విరుద్ధమైన వైఖరులు ఎందుకని అడిగితే నా సోదరుడు నేరం చేస్తే నాకేమిటి సంబంధమని, దానికి నేను ఎలా బాధ్యత వహిస్తానని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి వేరు, జగన్ అవినీతి వేరని, రెండింటికి మధ్య సంబంధం అంటగట్టుకూడదని ఆయన అన్నారు. జగన్ సంపదను కూడగట్టుకోవడానికి వైయస్సార్ సహాయపడ్డారని సిబిఐ ఆరోపిస్తుంది, లింక్ లేదని ఎలా అంటారని అడిగితే వైయస్సార్ తప్పు చేశాడా, ఒప్పు చేశాడా అనేది కోర్టు నిర్ణయించనీయండని ఆయన అన్నారు. జగన్ విషయంలో కూడా అదే వర్తిస్తుందని ఆయన అన్నారు. సిబిఐ కొన్ని ఆరోపణలు చేసిందని, అవి కోర్టులో తేలే దాకా ఆగాల్సి ఉందని, తాము ఇందులో తలదూర్చదలుచుకోలేదని ఆయన అన్నారు.
తుది శ్వాస వరకు వైయస్సార్ కాంగ్రెసు నాయకుడిగానే ఉన్నారని, వైయస్సార్ది గొప్ప వ్యక్తిత్వమని, కాంగ్రెసు నాయకుడిని ప్రశంసించడంలో తప్పేమిటని ఆయన అన్నారు. జగన్ను కాంగ్రెసు కావాలని ఇరికిస్తే తమ పార్టీ నేతలను కాపాడుకోలేకపోయామా అని ఆయన అడిగారు. కొంత మంది కాంగ్రెసు నాయకుల పేర్లను కూడా చార్జిషీట్లో చేర్చారని, వారు కూడా అరెస్టయ్యారని ఆయన గుర్తు చేశారు. యుపిఎ నాయకులు, కాంగ్రెసు నాయకులు కొంత మంది కేసుల్లో ఇరుకున్నారని, వారిని కావాలని కాంగ్రెసు ఇరికిస్తుందా అని ఆయన అన్నారు.
రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఇప్పుడు చర్చ జరగడం లేదని, నాయకత్వ మార్పులపై వచ్చిన వార్తలను తాను ఖండిస్తున్నానని, అయితే తమకు పరిణామాలూ పరిస్థితులు అన్నీ తెలుసునని, సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉందని ఆయన అన్నారు.