ఈ నియోజకవర్గానికి రుణ పడి ఉన్నా: ఏ పనులు కావాలన్నా చేయించుకోండి
నిషేధిత జాబితాల్లో ఉన్న భూములకు సంబంధించి హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిషేధిత 22 ఏ చేరిన భూముల సర్వే నంబర్లకు బై-నంబర్లు ఇచ్చి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేపీహెచ్బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నిషేధిత జాబితాలో పెట్టిన భూముల సమస్య గురించి ప్రస్తావించారు. 22 ఏ లో ఉన్న హక్కుదారుల స్థలాల పట్ల ఆందోళన అక్కర్లేదని, కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి సర్వే నంబర్లో వచ్చిన మొత్తం భూములను నిషేధిత జాబితాలో చేర్చారని వివరించారు. కోర్టు కేసులు ఉన్న స్థలాల వరకు పక్కనపెట్టి మిగతా వాటికి బైనెంబర్లు ఇచ్చి పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.

కూకట్ పల్లి ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, ఏం కావాలన్నా పనులు చేయించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, పాఠశాలలు, కాలేజీలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అవసరం అనుకున్న పరిశ్రమల విషయంలోనైనా సరే.. ఎలాంటి పనులనైనా చేయించుకోవాలని అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాలని మంత్రి శ్రీధర్ బాబుకు రేవంత్ సూచించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలు కూడా గత పాలన, ఈ రెండేళ్ల తన ప్రభుత్వాన్ని బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వేటినీ నిలిపివేయలేదని, వాటికి అదనంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోన్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 3.28 కోట్ల మందికి ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామని, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నామని అన్నారు.
రూ. 500 లకే సిలిండర్ అందజేస్తున్నామని, కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశామని, ఈ పథకాలేవీ కూడా గత ప్రభుత్వం లేవని రేవంత్ చెప్పారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి నెలకు 6,000 నుంచి 7,000 రూపాయల వరకు ఆదా అవుతోందని అన్నారు. ఇప్పటికే ఆర్టీసీకి 12,000 కోట్ల రూపాయలను చెల్లించామని వివరించారు. స్వయం సహాయక సంఘాలు 65,000 కోట్ల బ్యాంకు లింకేజీ ఇవ్వడంతో పాటు రూ. 2,500 కోట్ల వడ్డీ సైతం కట్టినట్లు చెప్పారు.
మహిళా సంఘాల పేరిట 1,000 బస్సులు తీసుకొచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుకు అవకాశం కల్పించడం, ఆదిలాబాద్ అడవుల నుంచి అచ్చంపేట వరకు ఆడబిడ్డలు తయారు చేసిన వస్తువులను విక్రయించుకోవడానికి శిల్పారామంలో మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా బజార్ల ఏర్పాటుకు స్థలాన్ని కల్పించామని అన్నారు.












Click it and Unblock the Notifications