అసెంబ్లీ సమావేశాల తర్వాతే బాబు తెలంగాణ లేఖ
మరోపక్క అక్టోబర్ 2 నుంచి తాను మొదలు పెట్టబోయే పాదయాత్రకు అవసరమైన సన్నాహాలను చంద్రబాబు పూర్తి చేసుకుంటున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ యాత్రను మొదలు పెట్టి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాతో ముగించాలని ఆయన నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతమైన ఉట్నూరు డివిజన్ నుంచి దీనిని ప్రారంభించాలని తాత్కాలికంగా నిర్ణయించారు.
కొమురం భీం జన్మస్ధలం జోడే ఘాట్ నుంచి మొదలు పెట్టాలని కొందరు సూచించారు. అయితే తుది నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఆ జిల్లా పార్టీ నేతలను గురువారం హైదరాబాద్కు పిలిపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో యాత్ర ముగించే అవకాశం ఉంది. ఈ యాత్రకు పెట్టాల్సిన పేరుపై రకరకాల ప్రతిపాదనలు వచ్చినా ప్రజాహిత పాదయాత్ర అన్న పేరుకు చంద్రబాబు సుముఖత చూపుతున్నారు.
యాత్ర పర్యటన మార్గం రూపకల్పన బాధ్యతను మాజీ పార్లమెంటు సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావుకు, యాత్రకు అవసరమైన స్థానిక అంశాల సమాచార సేకరణ బాధ్యతను, జయరాంరెడ్డికి, పర్యటన వెంట ఉంటూ దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావుకు, యాత్రకు సంబంధించిన ప్రచారం, పార్టీ నాయకులతో సమన్వయం బాధ్యతను రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్ధనరావుకు, మొత్తంగా యాత్ర పర్యవేక్షణ బాధ్యతను పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుకు అప్పగించారు.