బాబు పాదయాత్రకు కౌంటర్ చిరంజీవి ఆరోగ్యయాత్ర
వివిధ రకాల వ్యాధుల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా వైద్య సహాయం అందించేందుకు రాజ్య సభ సభ్యుడు చిరంజీవి ప్రత్యేక యాత్రలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమచారం. దానికి ఆయన ఆరోగ్య యాత్రగా పేరు పెట్టదలుచుకున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబరు నెలాఖరున ఆదిలాబాద్ జిల్లాతో ప్రారంభించి, ఒక డజను జిల్లాల్లో పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి రక్త నిధి ఆధ్వర్యంలో వైద్య శిబిరాలకు భిన్నంగా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.
చిరంజీవి చేపట్టే ఈ యాత్రలో తారా తోరణం ఉంటుందని చెపుతున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య యాత్రలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వైద్య నిపుణులు, ఔషధ కంపెనీల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలుస్తోంది. చంద్రబాబు పాదయాత్రకు ముందుగానే చిరంజీవి ఈ యాత్ర తలపెడుతున్నారు. దీన్నిబట్టి చంద్రబాబును ఎదుర్కునేందుకే ఆయన ఈ యాత్ర తలపెట్టినట్లు భావిస్తున్నారు.
ఈ ఆరోగ్య యాత్రలపై చిరంజీవి శుక్రవారం, శనివారాల్లో కొంత మందితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాజకీయాలతో ఈ యాత్రకు ఏ విధమైన సంబంధం లేదని చిరంజీవి సన్నిహితులు చెబుతున్నారు. అయితే, రాష్ట్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, చంద్రబాబు పాదయాత్రకు పోటీ ఇవ్వడానికి ఈ యాత్రను చెపట్టినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.