సిఎంగా జైపాల్ రెడ్డి: కేంద్ర మంత్రిగా కిరణ్ రెడ్డి?
ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న పృథ్వీరాజ్ చవాన్ను కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నారాయణ రాణేకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది. నారాయణ రాణేతో పాటు పలువురు మహారాష్ట్ర నాయకులు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. అయితే, రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగదని పృథ్వీరాజ్ చవాన్ అన్నారు.
అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సోనియా గాంధీ పలువురు నాయకులతో చర్చలు జరిపారు. శుక్రవారం రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్, అహ్మద్ పటేల్లతో చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించి, కేంద్ర మంత్రి వర్గంలోకి యువరక్తాన్ని ఎక్కించాలనే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా వారం, పదిరోజుల్లో జరిగిపోతుందని అంటున్నారు. రాహుల్ గాంధీ, మనీష్ తివారీలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు జోతిరాదిత్య, సచిన్ పైలట్లకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ మంత్రులు గులాం నబీ ఆజాద్, సుబోధ్ కాంత్ సహాయ్, జైశ్వాల్, బేణీ ప్రసాద్ వర్మ, వాయలార్ రవి, జైరాం రమేష్ వంటి సీనియర్లను పూర్తిగా పార్టీకి వాడుకోవాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి, తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వడమా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రోడ్ మ్యాప్ ప్రకటించడమా అనే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి ప్యాకేజీ మాత్రమే ఇచ్చి, 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కాంగ్రెసు అధిష్టానం చెప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి వాయలార్ రవితో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జరిపిన చర్చల్లో కూడా 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకునే విషయం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా రాజకీయానుభవం ఉన్న జైపాల్ రెడ్డిని పంపడం ద్వారా తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని అవమానించే విధంగా మార్పునకు శ్రీకారం చుట్టకుండా గౌరవం ఇస్తూ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా అందుకు సుముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు.