భారత్కు ఇస్లాం వ్యతిరేక సినిమా చిచ్చు: భారీ భద్రత
ముస్లిం సంఘాలు పిలుపుతో జయలలిత సర్కారు వెంటనే అప్రమత్తమైంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రాజధానిలో భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ముస్లిం సంఘాలు ముట్టడిస్తామని హెచ్చరించిన యుఎస్ ఎంబసీ వద్ద దాదాపు వెయ్యి మంది పోలీసులతో గట్టి పహారాను ప్రభుత్వం ఉంచింది.
అంతకుముందు ముస్లిం సంఘాలు భేటీ అయి అమెరికన్ చిత్రం ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ సినిమాను ప్రతి ఒక్కరూ నిషేధించాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముస్లిం వ్యతిరేకి అని, ఆరోపిస్తూ అతని దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి చర్యలను అడ్డుకున్నారు. ముస్లిం సంఘాలు యుఎస్ ఎంబసీ ముట్టడికి పిలుపునివ్వడంతో రెండు రోజుల పాటు వీసా దరఖాస్తులను నిలుపుదల చేశారు.
కాగా ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ చిత్రం విడుదలయిందని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. చిత్రాన్ని వ్యతిరేకిస్తూ లిబియాలోని అమెరికా కాన్సులేట్ పై ఆందోళనకారులు గత వారం దాడి చేశారు. ఈ దాడిలో ఓ అమెరికన్ అధికారి మృతి చెందాడు. ఆ తర్వాత ట్యునీషియాకు కూడా సినిమా చిచ్చు పాకింది.