ఏమీ జరక్కపోతే ఢిల్లీలో కెసిఆర్ ఎందుకున్నారు: సిఎం
తెలంగాణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని, వివిధ దశల్లో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. తన రేపటి ఢిల్లీ పర్యటన లేదని ఆయన చెప్పారు. తనను అధిష్టానం ఢిల్లీకి పిలిచిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ మార్చ్ను వాయిదా వేసుకోవాలని తాను నిర్వాహకులను కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ మార్చ్ను వాయిదా వేయించేందుకు వివిధ ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన చెప్పారు.
జీవవైవిధ్య సదస్సును, వినాయక నిమజ్జనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జీవవైవిధ్య సదస్సు దృష్ట్యా తెలంగాణ మార్చ్ను వాయిదా వేసుకోవాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. వినాయక నిమజ్జనం కారణంగానే శానససభా సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. డిసెంబర్లో మరోసారి శాసనసభా సమావేశాలు ఉంటాయని ఆయన చెప్పారు. జీవవైవిధ్య సదస్సు సందర్భంగా 400 కోట్ల రూపాయలతో అక్వేరియం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వంద కోట్ల రూపాయలతో మ్యూజియం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని ఆయన చెప్పారు.
అనిశ్చితి జీవితంలో భాగమని, సీమాంధ్ర నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదని ఆయన అన్నారు. సభా నిర్వహణ విషయంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉందని ఆయన అ్నారు. వచ్చే ఏడాది హైదరాబాదులో వ్యవసాయ సదస్సు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. సగటున రోజుకు 258 మిలియన్ యూనట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 181 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. లోటును అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు. ధర్మాన ప్రసాదరావు కన్నా ముందు కోర్టు మెట్లు ఎక్కి నోటీసులు అందుకున్న మంత్రులు ఉన్నారని ఆయన అన్నారు
జీవ వైవిధ్య సదస్సు మన రాష్ట్రంలో జరగడం శుభపరిణామమని ఆయన అంతకు ముందు శాసనసమండలిలో అన్నారు. జీవ వైవిధ్యం సదస్సులో తీసుకునే నిర్ణయాలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. అతి పెద్ద జీవవైవిధ్య సదస్సును అడ్డుకుంటే రాష్ట్ర ప్రగతికి విఘాతం కలుగుతుందని ఆయన అన్నారు. జీవ వైవిధ్య సదస్సు విజయవంతమైతే మరిన్ని అంతర్జాతీయ సదస్సులు హైదరాబాదులో జరుగుతాయని ఆయన అన్నారు.