తెలంగాణ, తెరాస విలీన ప్రకటనలు ఒకేసారి, 30లోపే?
కెసిఆర్ సోనియా గాంధీని కలిసే విషయాన్ని ఆయన కూతురు కల్వకుంట్ల కవిత ధ్రువీకరించారు. కెసిఆర్తో తాను చర్చలు జరుపుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి వాయలార్ రవి కూడా ఇది వరకే ధ్రువీకరించారు. కెసిఆర్ వాయలార్ రవితోనే కాకుండా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్తో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీన తలపెట్టిన తెలంగాణ మార్చ్ను వాయిదా వేసుకోవడానికి తెలంగాణ జెఎసి నిరాకరిస్తోదంది.
అక్టోబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ఉన్నందున తెలంగాణ మార్చ్ను వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులను ఆయన సంప్రదిస్తూ తెలంగాణ మార్చ్ వాయిదా పడేలా చూడాలని అడుగుతున్నారు. అయితే, అందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం చర్చలను ముమ్మరం చేసింది.
అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటన మాదిరిగానే ఇప్పుడు మరో ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, అందుకు సంబంధించిన తీర్మానం శాసనసభలో ప్రతిపాదిస్తారని ఆ ప్రకటన ఉంటుందని అంటున్నారు.
సోనియా గాంధీతో భేటీ కోసం తాము చూస్తున్నామని, భేటీ ఎప్పుడనేది ఇంకా తేలలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన కోసం కూడా ఎదురు చూస్తున్నామని, ఆ ప్రకటన వెలువడితేనే తాము విలీనం చేస్తామని చెప్తామని కల్వకుంట్ల కవిత ఓ జాతీయ పత్రిక మీడియా ప్రతినిధితో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు నెలలు పడుతుందని అంటున్నారు హైదరాబాద్ విషయమే సమస్యగా ఉందని అంటున్నారు. అయితే, హైదరాబాద్ను కొంత కాలం పాటు సీమాంధ్రతో తెలంగాణ పంచుకునే విధంగా ఇది జరగవచ్చునని అంటున్నారు.