డిజిపిగా మళ్లీ దినేష్ రెడ్డి: శనివారం ఉత్తర్వులు జారీ
సెలెక్షన్ ప్రక్రియ ద్వారా నియమితులయ్యే డిజిపిలు రిటైర్మెంట్తో సంబంధం లేకుండా రెండేళ్ల పాటు కొనసాగే అవకాశముంది. తాజాగా జారీచేసిన జీవోలో ఎంతవరకు కొనసాగుతారనేది ప్రస్తావన లేకపోయినా, సుప్రీం కోర్టు ఆదేశాలనుసారం జరిగిన నియామకమైనందున రెండేళ్లు కొనసాగనున్నారని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం దినేశ్ రెడ్డి వచ్చే ఏడాది అక్టోబర్లో పదవీ విరమణ చేయాలి. కానీ సెలెక్షన్ కమిటీ ప్రక్రియ ద్వారా నియమితులు కావడంతో నేటి నుంచి మరో రెండేళ్ల పాటు ఆయనే కొనసాగే వీలుంది.
గత ఏడాది జూన్ 30న దినేశ్ రెడ్డి డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన విషయం.. తనకన్నా జూనియర్ని నియమించారంటూ సీనియర్ ఐపీఎస్ గౌతంకుమార్ క్యాట్లో ఫిర్యాదు చేయడం, దానిపై క్యాట్, అలాగే హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించి డిజిపిగా దినేశ్ను తొలగించడం.. కొత్త ప్యానెల్ను రాష్ట్ర ప్రభుత్వం యూపిఎస్పీ సెలక్షన్ కమిటీకి పంపడం, అప్పటినుంచి దినేశ్ ఇన్చార్జీ డిజిపిగా కొనసాగుతుండటం తెలిసిందే.
దినేశ్ రెడ్డి సహా ఎనిమిది మంది పేర్లు గల ప్యానెల్పై శుక్రవారం ఢిల్లీలో సెలెక్షన్ కమిటీ సమీక్షించింది. ప్యానెల్లో మొదట ఉన్న గౌతం కుమార్ నాలుగు రోజుల కిందటే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రెండో స్థానంలోని ఉమేశ్ కుమార్పై తీవ్రమైన ఆరోపణలు ఉండటంతో కమిటీ ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తరువాత స్థానాల్లో ఉన్న దీంతో దినేశ్ రెడ్డి , అశోక్ ప్రసాద్, ఎస్ఏ హూడా పేర్లను పరిశీలించాల్సిందిగా కమిటీ సిఫారసు చేసింది.
కమిటీ నుంచి ఈ ప్యానెల్ శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూకు చేరింది. ప్యానెల్లో మొదటిపేరు దినేశ్దే ఉండటంతో ముఖ్యమంత్రి కిరణ్ ఖరారు చేశారు. శనివారం ప్రభుత్వ సెలవు. .అయినప్పటికీ ఈ నియామకం అత్యవసరం కావడంతో అప్పటి కప్పుడు సాధారణ పరిపాలన విభాగం (జిఏడి) సిబ్బందిని పిలిపించి పొద్దుపోయాక జీవో జారీ చేశారు. ఏకపక్ష నియామకం కుదరదని, అర్హుల పేర్లను పరిశీలించి ముగ్గురు పేర్లను యూపిఎస్సీ సిఫారసు చేస్తే వారిలో ఒకరిని డిజిపిగా నియమించుకునే అధికారాన్ని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది.