'కమాన్ అరెస్ట్ మి': పోలీస్పై యాష్కీ ఫైర్, ఓయులోకి..
తమను సిఎం క్యాంప్ కార్యాలయంలోకి రానీయక పోవడంతో ఎంపీలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అక్కడ నుండి పంపించే ప్రయత్నాలు చేశారు. దీంతో యాష్కీ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు పోలీసులా వీధి రౌడీలా అంటూ వారిపై మండిపడ్డారు. తాము కాంగ్రెసు పార్టీ కార్యకర్తలమని, ఎంపీలమని, తమను ముఖ్యమంత్రి వద్దకు అనుమతించక పోవడమేమిటని ప్రశ్నించారు. డోంట్ టచ్ ఎనీ వన్.. సిఎంతో మాట్లాడిపించండి అని నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణావాదుల అరెస్టు పిరికిపంద చర్య అన్నారు. శాంతియుతంగా కవాతు చేద్దామనుకుంటే ప్రభుత్వం దీనిని హింసాత్మకంగా మార్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు. పోలీసు వ్యవస్థ అడ్డుకుంటే కవాతు హింసాత్మకమవుతుందని, సామాన్య కార్యకర్తలను అరెస్టు చేయడం కాదని, దమ్ముంటే తనను అరెస్టు చేయమని యాష్కీ పోలీసులకు సవాల్ విసిరారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పోలీసులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిని పిలవండంటూ మండిపడ్డారు. తమ పైన పోలీసులు ఎలాంటి ఆకృత్యానికి పాల్పడుతున్నారో జిల్లాల్లోనూ అదే జరుగుతోందన్నారు. శాంతియుత ర్యాలీకి అనుమతించడం పోయి ఇలా తెలంగాణవాదులను రెచ్చగొట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ సమయంలో పోలీసులు, ఎంపీలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంపీలను అరెస్టు చేశారు.
అనంతరం కాంగ్రెసు సీనియర్ నేత కె కేశవ రావు మాట్లాడారు. తెలంగాణవాదుల అరెస్టు సరికాదన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి అరెస్టులు వద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని కానీ అరెస్టులు జరుగుతున్నాయని, దీనిని చూస్తుంటే ఎవరి పైన ఎవరు పని చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
పివి ఘాట్ వద్ద బాష్పవాయు ప్రయోగం
పివి ఘాట్ వద్ద పోలీసులు తెలంగాణవాదుల పైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. తెలంగాణవాదులు ముళ్లకంచె, బారీకేడ్లు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కోదండరామ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నెక్లెస్ రోడ్డు వద్ద పోలీసులు హెలికాప్టర్లో పహారా కాస్తున్నారు. డిజిపి దినేష్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తున్నారు.
ఓయులోకి పోలీసులు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. విద్యార్థుల రాళ్లు, పోలీసులు బాష్పవాయువు ప్రయోగం కొనసాగుతోంది. పోలీసులు ప్రధాన ద్వారం తెరిచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి చొచ్చుకెళ్లి బాష్పవాయువు ప్రయోగాన్ని చేస్తున్నారు.