రైల్వేస్టేషన్, సాక్షి వ్యాన్కు నిప్పు, స్పృహతప్పిన ఎస్సై
నెక్లెస్ రోడ్డులోని రైల్వే స్టేషన్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. జలవిహార్ వద్ద రెండు పోలీసు వాహనాలకు, సాక్షి ఓబి వ్యాన్కు నిప్పు పెట్టారు. మరో రెండు మీడియా వాహనాలను కూడా తగులబెట్టినట్లుగా తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు పీపుల్స్ ప్లాజా వద్ద గాల్లోకి కాల్పులు జరిపారు. పలుచోట్ల బాష్పవాయువును ప్రయోగిస్తున్నారు. లాఠీఛార్జ్ జరుగుతోంది. పలువురు తెలంగాణవాదులు ట్యాంక్ బండ్ వైపుకు ఆందోళకారులు వెళ్లకుండా అడ్డుకున్నారు.
కొందరు అటు వైపుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా పోలీసులు వారిని అడ్డుకొని లాఠీఛార్జ్ చేశారు. మరోవైపు మెదక్ జిల్లా పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి కవాతు వేదిక వైపుకు వస్తుండగా పోలీసులు ఖైరతాబాద్ వద్ద అడ్డుకున్నారు. ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం కాసేపటికి ఆమెను అనుమతించారు. సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తెరాస ఎమ్మెల్యేలు పలువురు కవాతు వేదిక వద్దకు చేరుకున్నారు.
తెలంగాణ ప్రకటన వచ్చే వరకు కదలొద్దు.. కోమటిరెడ్డి
తెలంగాణపై కేంద్రం నుండి అనుకూల ప్రకటన వచ్చే వరకు తెలంగాణవాదులు నెక్లెస్ రోడ్డు నుండి కదలద్దని కోమటిరెడ్డి అన్నారు. తాము శాంతియుతంగా కవాతుకు సిద్ధమైతే ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం వద్ద పోలీసులు మరోసారి బాష్పవాయువును ప్రయోగించారు. ముఖ్యమంత్రి తెలంగాణ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.