పోటాపోటీ: కత్తులు నూరుకుంటున్నసిఎం, వివేక్ క్యాంప్
వివేక్కు వ్యతిరేకంగా కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల నేతలు ఏకతాటి పైకి వస్తున్నారట. వివేక్కు వ్యతిరేకంగా సిఎం వర్గం నేత, శాసనమండలి సభ్యుడు ప్రేమ్ సాగర రావు నేతలను ఒక్క తాటి పైకి తీసుకు వస్తున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం వివేక్ సొంత జిల్లా కరీంనగర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వారు పెద్దపల్లి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిపై ప్రశ్నించనున్నారని సమాచారం. తెలంగాణ అంశాన్ని కూడా వివేక్పై సంధించనున్నారట.
ఇప్పటికే పలువురు నేతలు ఎంపీలు తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా ఉద్యమించే వారే అయితే వారు ఢిల్లీలో వెళ్లి అధిష్టానం వద్ద నిరసన తెలపాలని, హైదరాబాదులో కాదని సూచించారు. అయితే వివేక్ వర్గం కూడా తక్కువేమీ తినలేదంటున్నారు. వారు కూడా పోటా పోటీ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
సమన్వయానికి కృషి... పొంగులేటి
ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రాంత ఎంపీల మధ్య కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమేనని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఇరువర్గాల మధ్య తాము సమన్వయానికి కృషి చేస్తామన్నారు. కూర్చునే కొమ్మనే నరుక్కునే ప్రయత్నాలు ఎవరు చేసిన సరికాదన్నారు. చెట్టెక్కి కూర్చున్న వారు పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేయవద్దన్నారు. ఎంపీలకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు.