జూ.ఎన్టీఆర్, హరికృష్ణ దెబ్బతిని రాజీకొచ్చారా? వంశీ..
లోకేష్ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషిస్తే తన తనయుడుకి భవిష్యత్తులో పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం లేకుండా పోతుందని హరికృష్ణ ఆవేదన చెందారు. అప్పటి నుండి హరికృష్ణ, జూనియర్లు పార్టీ అధినేతపై గుర్రుగా ఉన్నారు. జూనియర్ బయటకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసినప్పటికీ, హరికృష్ణ మాత్రం తన అసంతృప్తిని పలుమార్లు నిరసనల ద్వారా వెళ్లగక్కారు. ఇటీవలి కాలంలో పార్టీ సమావేశాలకు హరికృష్ణ వెళ్లిన సందర్భాలు వేళ్లమీద లెక్క పెట్టవచ్చు.
అయితే బాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర మాత్రం నారా-నందమూరి కుటుంబాలని కలిపింది. పాదయాత్ర ప్రారంభానికి రెండు రోజుల ముందే హరికృష్ణ హిందూపురం చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా యాత్ర మహబూబ్నగర్ జిల్లాకు చేరుకున్న తర్వాత బాబుతో కదం కలపనున్నారు. నారా-నందమూరి కుటుంబాలు ఏకం కావడం టిడిపి క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
అయితే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తగ్గడానికి వారు దెబ్బతినడమే కారణమంటున్నారు. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత టిడిపికి గట్టి మద్దతుదారులుగా ఉన్న సామాజికవర్గంతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారణం జూనియర్కు నాని సన్నిహితుడు కావడమే. జూనియరే అతనిని బాబుపై అసంతృప్తితో బయటకు పంపించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో యంగ్ హీరో బయటకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయినప్పటికీ టిడిపి మద్దతుదారులు తగ్గలేదు. నాని బయటకు వెళ్లడం, బాబుతో విభేదాల వల్ల అదే సమయంలో విడుదలైన జూనియర్ సినిమా దమ్ము చిత్రం పైన తీవ్ర ప్రభావం పడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా పైనే కాకుండా రాజకీయంగానూ ఇటు హరికృష్ణకు ఎవరు మద్దతు పలకలేదు. ఇలా అయితే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడుతుందనే భావనతోనే తండ్రీ కొడుకులిద్దరు బాబుతో రాజీకొచ్చారని అంటున్నారు. కృష్ణా జిల్లా నేత వల్లభనేని వంశీ కూడా నాని బాటలోనే జగన్ వైపు వెళ్లాలనుకున్నప్పటికీ ఎవరూ సపోర్ట్ చేయక పోవడంతో వెనక్కి తగ్గారని అంటున్నారు.