నా రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే ఎవరికైనా ఏళ్లు: చంద్రబాబు
తాను ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టానని అన్నారు. కాంగ్రెసు హయాంలో పంట భీమా రుణ భీమాగా మారిందన్నారు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని ఆరోపించారు. వర్షాకాలంలోనే మూడుగంటలు మాత్రమే విద్యుత్ ఇస్తే ఇక ఎండాకాలంలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసు వల్ల చాలామంది అధికారులు జైలుకెళ్లారన్నారు.
కాంగ్రెసు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. టిడిపి ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి ఇమేజ్ తీసుకు వస్తే, కాంగ్రెసు మాత్రం ప్రతిష్టను దిగజార్చిందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తన యాత్రలో ఎవరిని కదిపినా కన్నీళ్లే వస్తున్నాయన్నారు. పిల్ల భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు. ఉద్యోగాలు కావాలంటే పెట్టుబడులు కావాలని, కానీ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు.
చేనేత పరిశ్రమనే మూత పడేసే స్థితికి తీసుకు వచ్చారన్నారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూత పడ్డాయని, తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలన దోపిడీ, దౌర్జన్య పాలన అని మండిపడ్డారు. పేదల సంపదను కాంగ్రెసు నేతలు దోచుకున్నారని, జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆశయాల కోసం కృషి చేస్తున్న పార్టీ టిడిపి మాత్రమే అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పారు.
రైతులు ఆత్మగౌరవంతో బతికేలా తీర్చుదిద్దుతామన్నారు. అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని, వారికి అండగా నిలుస్తామన్నారు. మైనార్టీలకు, ఎస్సీ, ఎస్టీ, బిసిలు అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు నాంది పలికింది తామేనని చంద్రబాబు చెప్పారు. కాగా బాబు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.