పాదయాత్ర కాదు ఓదార్పే బెట్టర్: షర్మిలతో విజయమ్మా
అందుకే జగన్ జైలులో ఉన్నప్పటికీ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు షర్మిలచే పాదయాత్ర చేయించాలని పలువురు నేతలు భావిస్తున్నారు. విజయమ్మచే యాత్ర చేపట్టాలంటే ఆమె వయస్సు సహకరించదు. కాబట్టి షర్మిలచే యాత్ర చేయించాలని చూస్తున్నారు. అయితే ఇది పాదయాత్రగా ఉండాలా లేక ఓదార్పు యాత్రగా ఉండాలా అనే అంశంపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం.
ఓదార్పు యాత్ర చేస్తే విజయమ్మ కూడా ప్రజల్లో వెళ్లేందుకు అవకాశం ఉంటుందని, ఆమెతో పాటు షర్మిల కూడా వెళితే బాగుంటుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు 2200 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో అంతకుమించి 2500 కిలోమీటర్లతో షర్మిలతే పాదయాత్ర తలపెట్టాలని మరికొందరు నేతలు భావిస్తున్నారట. అలా అయితేనే టిడిపికి ధీటుగా ఉంటుందని భావిస్తున్నట్లుగా సమాచారం.
అయితే షర్మిల మహిళ అయినందున అది కష్టసాధ్యమని, పాదయాత్ర చేపట్టి మధ్యలో నిలిపివేసే పరిస్థితి రావొద్దని, అలా వస్తే నష్టం వాటిల్లుతుందని, అందుకు బదులు ఓదార్పు యాత్ర చేపడితే రెండు విధాలుగా లబ్ధి ఉంటుందని భావిస్తున్నారని అంటున్నారు. పాదయాత్ర చేపడితే షర్మిల ఒక్కరే వెళ్లాల్సి ఉంటుందని, అదేకాకుండా మధ్యలో ఆగిపోదని కూడా చెప్పలేమని, అదే ఓదార్పు అయితే విజయమ్మ కూడా పాల్గొనే అవకాశముంటుందని చెబుతున్నారట. అయితే ఓదార్పా లేక పాదయాత్రా అని ఈ రోజు తేలనుంది.