హైకమాండ్ పెద్దలతో భేటీలు, తెలంగాణ మంత్రులు బిజీ
తెలంగాణపై కేంద్రం నుంచి ప్రకటన రాకపోతే తాము నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదని వారు చెప్పుకున్నారు. వారి నివేదనకు వాయలార్ రవి, ఆజాద్ల నుంచి ఒకే రకమైన సమాధానం లభించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై తమకు అంతా తెలుసునని వారు చెప్పారు. తెలంగాణ అంశంపై ఢిల్లీకి రావడం వల్ల ప్రయోజనం ఉండదని వారు మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీకి రావడం విమానం ఖర్చులు వృధా అవుతాయని వారు అన్నట్లు ప్రచారం జరుగుతోంది. పనిలో పనిగా తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి వల్ల రాష్ట్రంలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని వారు చెప్పారు.
వాయలార్ రవిని, ఆజాద్ను కలిసిన తర్వాత తెలంగాణ మంత్రులు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణకు చెందిన నలుగురు మంత్రులు మాత్రమే ఢిల్లీకి రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ మంత్రుల్లో ఐక్యతను కిరణ్ కుమార్ రెడ్డి దెబ్బ తీస్తున్నారని వారు గుర్రుమంటున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ మార్చ్ ప్రశాంతంగా జరగడానికి తామే కారణమని వారు కేంద్ర మంత్రులకు చెప్పుకున్నట్లు తెలుస్తోంది. మిలియన్ మార్చ్ అనుమతుల విషయంలో చొరవ చూపి పరిస్థితి పార్టీకి వ్యతిరేకం కాకుండా చూశామని వారు చెప్పారు.