తెలంగాణపై కాంగ్రెసు నేతలు: జగన్, బాబు భయాలు
తెలంగాణ మంత్రులు ఇటీవల ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ విషయంలో తెలంగాణ మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు మధ్య వివాదం నెలకొంది. తెలంగాణ మంత్రులు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అంటున్నారు. అయితే, తెలంగాణ కోసం మంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తే ప్రత్యేక రాష్ట్రం వస్తుందని మంత్రి డికె ఆరుణ ఇటీవల స్పష్టం చేశారు. అంతేకాకుండా గతంలో తాము పదవులకు రాజీనా మాలు చేసి దూరంగా ఉంటే, తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడి పోతుందని ఆమె అన్నారు. ఇరవై మంది శానససభ్యులు తిరుగుబాటు చేస్తే తెలంగాణ వస్తుందని సీనియర్ కాంగ్రెసు నేత కె. కేశవ రావు ఆదివారంనాడు అన్నారు.
పాదయాత్రల వల్లనే కాకుండా తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పి ముందుకు సాగితే వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ప్రాంతంలో బలపడుతాయని, అప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పడానికి తమ వద్ద ఏదీ ఉండదని పలువురు తెలంగాణ నాయకులు అంటున్నారు. తెలంగాణ మంత్రులు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలిసి తెలంగాణపై నిర్ణయం ప్రకటించాలని కోరే అవకాశాలున్నాయి.
తెలంగాణ అంశంపై తెలంగాణ కాంగ్రెసు నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసు తెలంగాణ నాయకులు గ్రూపులుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. ఇటీవల మంత్రి డికె ఆరుణ నేతృత్వంలో మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిశారు. తాజాగా సీనియర్ మంత్రి కుందూరు జానారెడ్డి బృందంలో ముగ్గురు మంత్రులు మాత్రమే ఉన్నారు. పార్లమెంటు సభ్యుల విషయానికి వస్తే ఒకరిద్దరు ఎంపీలు సమావేశానికి దూరంగా ఉంటున్న ట్లుగా కనిపిస్తుంది.
ఇటీవల నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ నివాసంలో జరిగిన సమావేశానికి తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఒకరు హాజరైనప్పటికీ, తెలంగాణ జెఎసి నేతలు ఉన్న కారణంగా ఆయన వెంటనే వెళ్ళిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వేరు కుంపట్లు పెట్టుకోకుండా అందరూ ఒకే తాటిపైకి వ చ్చి తెలంగాణ సాధించాలని తెలంగాణ వాదులు కోరుకుంటున్నారు.