కిరణ్కు బాబు సలహాదారు: షర్మిల, నాతో రండి: బాబు
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. ఈ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని, కిరణ్ సర్కార్, చంద్రబాబు సర్కారుకు ఏమాత్రం తీసిపోని విధంగా సాగుతోందన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు సాగునీరు కల్పిస్తే పంటలు పండితే ఆ పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ఎక్కడ కల్పించాల్సి వస్తుందోనని ఆ పనులు చేయడం లేదని విమర్శించారు.
రైతులకు ఏడు గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కల్పిస్తే నేడు రెండు గంటలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. తాగునీరు మురుకిగా ఉందని, ఈ నీటిని కిరణ్కో, బాబుకో ఇవ్వాలన్నారు. విద్యుత్తు ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందోనన్న ముందుచూపు లేకుండా సిఎం వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామని వైయస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. విద్యార్థులకు అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను కల్పించనున్నామన్నారు. కిరణ్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. జగన్ జైలునుంచి బయటకు వచ్చి రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆమె జోస్యం చెప్పారు.
నాతో కలిసిరండి... చంద్రబాబు
కేంద్రం నగదు బదలీ పథకాన్ని ప్రవేశ పెట్టింది రేషన్ బియ్యం రద్దు చేసేందుకేనని చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలోని తన పాదయాత్రలో అన్నారు. దీంతో పేతలకు మరింత భారం తప్పదన్నారు. రాబోయే ఎన్నికల్లో ముస్లింలకు 15 సీట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. చట్టసభల్లో 8 శాతం రిజర్వేషన్తోపాటు రూ.2,500 కోట్లు ముస్లింల అభివృద్ధికి కేటాయించి చరిత్ర సృష్టిస్తానని వెల్లడించారు.
తనకు ఏ ఆశలూ లేవని, మిమ్మల్ని మేల్కొలిపేందుకే వచ్చానని చెప్పారు. తాను చెప్పిన అంశాలపై చర్చించి, వాస్తవాలు ఉంటే తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా రాష్ట్రాన్ని దోచుకున్నారని, లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకున్న నేత ఐదు లక్షల కోట్ల సంపాదనే ధ్యేయంగా రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.