నో మెర్జర్, తేల్చకుంటే చావే: విజయశాంతి, సిపిఐ ప్రశ్న
కాంగ్రెసును వదిలి బాబు పైనా.. నారాయణ
తెలంగాణపై అధికార కాంగ్రెసు పార్టీని వదిలి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర సమితి పడటమేమిటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాదులో అన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని, అలాంటప్పుడు ఎలా అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. సమస్యను తేల్చాల్సిన కాంగ్రెసును వదిలేసి వ్యతిరేకం కాదన్న ప్రతిపక్ష పార్టీని ఎలా అడ్డుకుంటారని అడిగితే కెసిఆర్ ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
అన్ని పార్టీల బాణాలు అధికార కాంగ్రెసు పార్టీ వైపు ఉండాలన్నారు. కానీ తెరాస, జెఏసి టిడిపిని టార్గెట్ చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంతో కెసిఆర్ చర్చలు జరపడాన్ని తాను తప్పు పట్టడం లేదని, కానీ ఆ పార్టీని నిలదీయాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు. అయినా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెసు పార్టీతో కెసిఆర్ చర్చలు ఎలా జరుపుతారో చెప్పాలని నారాయణ ప్రశ్నించారు.
స్పష్టత ఇవ్వాల్సిందే.. రాఘవులు
ప్రజా సమస్యలపై రాజకీయ యాత్రలు చేసే ఏ పార్టీ అయినా తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. స్పష్టత ఇవ్వకుంటే నిలదీసే హక్కు ప్రజలకు ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాటతో బలాదూర్గా తిరిగి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అధిష్టానం ఆశీస్సులతో ఆయన ఇంకా పదవిలో కొనసాగుతున్నారన్నారు.
తెలంగాణపై అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని అందరూ డిమాండ్ చేయాలన్నారు. తెలంగాణపై తేల్చకుండానే పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం, షర్మిల మరో ప్రజా ప్రస్థానం కోసం తమ మద్దతు లేదన్నారు.