విజయమ్మ చేతిలో బైబిల్: రాజేంద్ర ప్రసాద్ ఎదురుదాడి
తాను బైబిల్ను అవమానపర్చలేదని, క్రైస్తవులను కించపర్చలేదని, ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని చెప్పారు. విజయమ్మ బైబిల్ పట్టుకొని రాజకీయాలు చేస్తూ.. తమ మత గ్రంథాన్ని అపవిత్రం చేస్తున్నారని కొందరు క్రైస్తవ సోదరులు చేసిన విజ్ఞప్తి మేరకే తాను ఆమెను ప్రశ్నించానని చెప్పారు. మత బోధనలు చేస్తూ రాజకీయాలు చేయడం ఎంత వరకు సమంజసమో చెప్పాలని ఆయన విజయమ్మను ప్రశ్నించారు.
తనకు బైబిల్ అంటే గౌరవం ఉందన్నారు. కానీ విజయమ్మ ఓ క్రైస్తవురాలు అయి ఉండి బైబిల్ పట్టుకొని అసత్య ప్రచారాలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. రాజకీయాలకు మతాన్ని ముడిపెట్ట వద్దన్నారు. దీనిపై చర్చ జరగాల్సి ఉందన్నారు. విజయమ్మ, జగన్ సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్లు వీరంతా ఇటు హిందువుల మనోభావాలను, అటు క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
కాగా విజయమ్మ తన కూతురు షర్మిల పాదయాత్ర సమయంలో బైబిల్ పట్టుకోవడాన్ని రాజేంద్ర ప్రసాద్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. అయితే ఎస్సీ, ఎస్టీ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున సోమవారం రాజేంద్ర ప్రసాద్ క్రైస్తవ మతాన్ని కించపర్చారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.