కొనసాగింపు: అంబికా, సుబోధ్ కాంత్ రాజీనామా
సుబోధ్ కాంత్ సహాయ్తో పాటు సామాజిక న్యాయం, సాధికారితా మంత్రి ముకుల్ వాస్నిక్ కూడా తన రాజీనామా లేఖను ప్రధానికి సమర్పించారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజీనామాలు ఊపందుకుంటున్నాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఆదివారం ఉదయం పదకొండున్నర గంటలకు జరుగుతుందని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి వేణు రాజమొని చెప్పారు.
పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో మరింత మంది కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, శుక్రవారం ఎస్ఎం కృష్ణ చేసిన రాజీనామాను ప్రధాని ఆమోదించారు. తాను శుక్రవారంనాడే రాజీనామా లేఖను అందించినట్లు శనివారం ప్రధానిని కలిసిన ముకుల్ వాస్నిక్ మీడియాతో చెప్పారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియా మధ్య ముఖాముఖి చర్చల తర్వాత మంత్రుల రాజీనామాలు ముందుకు వచ్చాయి.
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ప్రధానికి స్వేచ్ఛ ఇవ్వడానికే తాను రాజీనామా చేసినట్లు కృష్ణ చెప్పారు. జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్లకు ప్రమోషన్ లభించవచ్చునని భావిస్తున్నారు. అగాథా సంగ్మా స్థానంలో మరొకరికి స్థానం ఇవ్వాలని ఎన్సీపి కోరింది. అగాథా సంగ్మా స్థానంలో తారిక్ అన్వర్కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి.