'చిరు' కోరిక నెరవేరినట్లేనా: 'పురంధేశ్వరి' ఎఫెక్ట్ పడేనా?
హైదరాబాద్: కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెసు పార్టీ ముఖ్యనేత చిరంజీవి కోరిక నెరవేరిందా అంటే కాదనే అంటున్నారు. ఆయన ఏ లక్ష్యంతో కాంగ్రెసు పార్టీలో చేరారో దాని కోసమే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారని చెబుతున్నారు. చాలా రోజుల నిరీక్షణ తర్వాత కేంద్రమంత్రి పదవి వచ్చినప్పటికీ ఆయన లక్ష్యం మాత్రం 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రి కావడమే అంటున్నారు.
అందుకోసం కేంద్రమంత్రిగా ఉంటూనే రాష్ట్రం పైనా ఆయన ఇక నుండి ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పర్యాటక శాఖ సహాయమంత్రిగా ఆయన స్వతంత్ర హోదాలో ఉన్నారు. దీనిని ఆయన ఉపయోగించుకొని రాష్ట్రాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్ది తద్వారా తన పట్టును ఆయన పెంచుకుంటారని చెబుతున్నారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ 2014 లక్ష్యంగా ఆయన రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని చెబుతున్నారు.
ఇప్పటికే పలువురు కాంగ్రెసు నాయకుల నుండి ఆయనకు మద్దతు లభిస్తోంది. మాజీ పీఆర్పీ నేతలతో పాటు కొత్తగా ఆయనకు కాంగ్రెసులో మద్దతు పెరుగుతోంది. ఆనం సోదరులు వంటి పలువురు నేతలు, ఆయా జిల్లాల్లో ప్రధానంగా ఉన్న వారు వచ్చే సాధారణ ఎన్నికల వైపు చిరంజీవి వైపు మొగ్గు చూపనున్నారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా చిరంజీవికి ఒకే చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి చీప్ బొత్స సత్యనారాయణను నమ్ముకోవడం కంటే చిరున నమ్ముకోవడమే మేలని పలువురు భావిస్తున్నారు.
అధిష్టానం వద్ద తనదైన మార్కు రాజకీయాలను చిరు ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. పార్టీని వీలీనం చేసి ఇన్ని రోజులు అవుతున్నా ఏనాడూ అతను పదవి కోసం అధిష్టానం వద్ద డిమాండ్లు, అలకలు ప్రదర్శించలేదు. మిగిలిన నేతలు వేరు చిరంజీవి వేరు. చిరంజీవి సినిమా రంగం నుండి వచ్చిన వ్యక్తి. అతనికి ఎపిలో భారీగా అభిమానులు ఉన్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్ర స్థాయిలో తప్పితే ఢిల్లీ స్థాయి వరకు తన అసంతృప్తిని బయటపెట్టలేదని అంటున్నారు. ఇక్కడ కూడా తన వర్గం వారి పదవుల కోసమే ఆయన పట్టుబట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసును గట్టెక్కించి 'ముఖ్య'మైన పదవిని కొట్టేసేందుకు ఆయన కేంద్రమంత్రి పదవిని ఉపయోగించుకుంటారని చెబుతున్నారు.
వచ్చినట్లే వచ్చి చేజారిన ప్రమోషన్
కేంద్ర సహాయ మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరికి ప్రమోషన్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. పురంధేశ్వరికి ప్రమోషన్ ఖాయమైన సమయంలో ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు అలక దానికి బ్రేక్ వేసింది. అంతకుముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమెకు ఫోన్ చేసి ప్రమోషన్ వచ్చిందని శుభాకాంక్షలు కూడా తెలియజేశారట. దీంతో ఆమె వర్గంలో ఒకింత ఉత్సాహం తొణికిసలాడింది. కానీ కావూరి అలక ఆమె ప్రమోషన్కు చెక్ పెట్టింది.
పురంధేశ్వరికి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని క్రమంగా దగ్గరకు చేసుకోవాలని పార్టీ అధిష్టానం భావించినట్లుగా కనిపిస్తోంది. చిరంజీవికి ఇచ్చి పురంధేశ్వరికి ఇవ్వలేదంటే విమర్శలు వస్తాయి. కానీ ఇవ్వడం ద్వారా ఇటు చిరు అభిమానులు, సామాజిక వర్గంతో పాటు, పురందేశ్వరి సామాజిక వర్గాన్ని కూడా ఆకట్టుకోవాలని అధిష్టానం భావించింది. అయితే కావూరి అందుకు అడ్డుకాలు వేశారు. లాస్ట్ మినట్లో ఆమెకు పదవి దక్కక పోవడంతో ఇప్పటికే అరకొరగా ఉన్న ఆ సామాజిక వర్గం మద్దతు మరింత కోల్పోయే అవకాశముందని చెబుతున్నారు.
జైపాల్ రెడ్డికి డిమోషన్
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని డిమోషన్ చేశారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న జైపాల్కు తాజా పునర్వ్యవస్థీకరణలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను అప్పగించారు. ఇది ఆయన స్వయంకృపరాధమే అనే వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.