ముక్కు నేలకు రాయాలి: కెసిఆర్పై కొండా సురేఖ
తెలంగాణలో అన్ని సీట్లు గెలిచినా కెసిఆర్ తెలంగాణ తేలేరని ఆమె అన్నారు. ఉద్యమం పేరుతో కెసిఆర్ 11 ఏళ్లుగా కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆమె విమర్శించారు. వంద శానససభా స్థానాలు, 16 లకోసభ స్థానాలు గెలిస్తే తెలంగాణ ఎలా వస్తుందో కెసిఆర్ చెప్పాలని ఆమె సవాల్ చేశారు. రాజకీయంగా కోట్లాది రూపాయలు గడించడమే తెరాస ఎజెండా అని ఆమె ఆరోపించారు.
షర్మిల పాదయాత్రను తెలంగాణలో తెరాస అడ్డుకోలేదని ఆమె అన్నారు. షర్మిల పాదయాత్రను అడ్డుకుంటే ప్రజలే గుణపాఠం చెప్తారని ఆమె అన్నారు. ప్రధాని చెప్తేనే ఉద్యమాన్ని ఆపానని కెసిఆర్ చెబుతున్నారని, దీన్నిబట్టి కాంగ్రెసు, తెరాస కుమ్మక్కయినట్లు స్పష్టంగా తెలిసిపోతోందని అన్నారు. నెల రోజులు ఢిల్లీలో ఉన్న కెసిఆర్ కనీసం తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చేత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయించలేకపోయారని సురేఖ అన్నారు.
వైయస్ జగన్, వైయస్ విజయమ్మ తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పారని ఆమె గుర్తు చేశారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తోనో, శాసనసభలో తీర్మానం ప్రతిపాదిస్తేనో తెలంగాణపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. పరకాల ఉప ఎన్నిక తర్వాత తెరాసకు భయం పట్టుకుందని ఆమె అన్నారు. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలాన్ని చూసి తెరాస భయపడుతోందని, అందుకే తమపై విమర్సలు చేస్తోందని ఆమె అన్నారు. తెలంగాణలో మొదటి రెండు స్థానాల్లో తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణపై తెరాస మోసం చేసిందే గానీ తమ పార్టీ మోసం చేయలేదని ఆమె అన్నారు.