చంద్రబాబు, వైయస్ జగన్: ముందస్తు అనుకుంటే...!
టిడిపి, కాంగ్రెసుల నుండి పలువురు జగన్ పార్టీలోకి ఇటీవల చేరుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు ప్రతిపక్షంలో కూర్చున్న టిడిపిలో వలసలు జోరందుకోవడంతో నిర్లిప్తత కనిపించింది. అదే సమయంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపించాయి. దీంతో కేడర్లో ఉత్సాహం నింపేందుకు, ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఇదే సరైన సమయమని భావించిన చంద్రబాబు ముందడుగు వేశారని అంటున్నారు.
రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో పార్టీ సమావేశంలో నేతలను ఎన్నికల పట్ల అప్రమత్తం చేశారు. ముందస్తు ఎన్నికలు ఏ సమయంలోనైనా రావొచ్చునని, అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బాబు పాదయాత్రకు ముందు కూడా ఇదే తరహా సంకేతాలు ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభించిన రెండు మూడు రోజుల తర్వాత యాత్రకు వచ్చిన స్పందన చూసిన పార్టీ దీనిని వచ్చే సంవత్సరం మార్చిలో కొనసాగించేందుకు కూడా నిర్ణయించుకున్నాయి.
అయితే అంతలో షర్మిల పాదయాత్ర ప్రారంభం కావడంతో జనవరి 26న ముగిస్తే పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని భావించిన టిడిపి స్లోగా పొడిగించాలనే నిర్ణయానికి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యే చంద్రబాబుకు పోటీ యాత్ర ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. తమ పార్టీలోకి జోరుగా వలసలు ఉన్న సమయంలో బాబు పాదయాత్రతో ఎక్కడ తమకు అడ్డంకి ఏర్పడుతుందోనని భావించే షర్మిలను రంగంలోకి దింపారని అంటున్నారు.
జంప్ జిలానీల లెక్కలు వేసుకున్న చంద్రబాబు, జగన్ పాదయాత్రలకు మొగ్గి చూపారని అంటున్నారు. అయితే ఇంత త్వరగా కిరణ్ ప్రభుత్వానికి దెబ్బ తగులుతుందని, అది కూడా ఎంఐఎం వల్ల ఉంటుందని వారు భావించి ఉండరని అంటున్నారు. జగన్ పార్టీ వైపు వలసలు పెరిగి వచ్చే సంవత్సరం ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉంటాయని ఆ రెండు పార్టీలు భావించి ఉంటాయని అంటున్నారు. కానీ వారు అనుకున్న దానికి ఇప్పుడు భిన్నంగా జరిగి ఉంటుందంటున్నారు.
మరోవైపు ఎంఐఎంకు జగన్ పార్టీ ఎప్పటి నుండో గాలం వేస్తోందని, ఈ సమయం కోసమే అది కాచుక్కూచున్నదని మరికొందరు అంటున్నారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరిస్తే... కాంగ్రెసులోని తమ వర్గాన్ని ప్రయోగించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చూస్తోందని అంటున్నారు. ఎంఐఎం ఉపసంహరణతో అంకెల్లో కాంగ్రెసుకు ఇబ్బంది లేకపోయినప్పటికీ అవిశ్వాస పరీక్షనో విశ్వాస పరీక్షనో పెడితేనే తేలుతుంది.