మహిళా టెక్కీని భర్తే 11 సార్లు పొడిచి చంపాడు
రుచి చౌదరీ (28) అనే మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ను భర్త సంజయ్ వెండి కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత తన మణికట్టును కోసుకునే ప్రయత్నం చేశాడు. అయితే, స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. అతను ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఐటిపిబిలోని ఐటి కంపెనీలో రుచి పనిచేస్తోంది. సాఫ్ట్వేర్ వృత్తినిపుణుడు అయిన సంజయ్ కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసెస్, అవుట్ సోర్సింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
గుర్గావ్లో పనిచేస్తున్న సంజయ్ బెంగళూర్కు విమానంలో వచ్చాడు. భార్యను చంపడానికే అతను బెంగళూర్ వచ్చాడని పోలీసులు అంటున్నారు. తనతో పాటు వెండి కత్తిని తీసుకుని వచ్చాడు. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చిన సంజయ్ ఆపార్టుమెంటులోని తన ఇంట్లోకి వెళ్లి భార్యతో గొడవ పడ్డాడు. రుచి తల్లిదండ్రులు కల్పించుకుని చల్లార్చే ప్రయత్నం చేశారు. అయితే, అతను వారిని తోసేశాడు. దాంతో మనవరాలిని తీసుకుని బయటకు వెళ్లారు.
వారు బయటకు వెళ్లగానే సంజయ్ తలుపులు వేశాడు. ఆ వెంటనే సాయం చేయండంటూ రుచి అరవడం వినిపించింది. పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. సంజయ్ కత్తితో కుర్చీలో కూర్చుని ఉన్నాడు. రుచి రక్తం మడుగులో పడి ఉంది.
రుచి, సంజయ్ నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాను తీసుకుని ఏ ఆర్థిక నిర్ణయాలపైనా తనను బలపరచడం లేదని భావించిన సంజయ్ ఆమెను చంపాడు. ఇరువురు తరుచూ గొడవ పడుతూ ఉండేవారు. తాను ఢిల్లీలో ఫ్లాట్ కొనాలని అనుకున్నానని, అయితే రుణం తీసుకుని సాయం చేయడానికి భార్య నిరాకరించిందని సంజయ్ పోలీసులకు చెప్పాడు.
నాలుగేళ్ల కాలంలో సంజయ్ కొంత కాలం వర్క్ అసైన్మెంట్పై అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత బెంగళూర్లోని తన కంపెనీలో పనిచేశాడు. ఏడాదిన్నర క్రితం అతనికి గుర్గావ్ బదిలీ ఆయింది. తరుచూ భర్త గొడవ పడుతుండడంతో రుచి తన తల్లిదండ్రులను పిలిపించుకుంది.