గీతారెడ్డిపై వ్యాఖ్య: కోదండ ఇంటివద్ద ఉద్రిక్తత, అరెస్టు
ఆందోళనకారులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో పోలీసులు వారిని అక్కడి నుండి పంపించేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు ఎంతగా చెప్పినా వారు వినలేదు. పోలీసులు, దళిత సంఘాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు దళిత సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డిఎస్ఎఫ్ కోదండరాంకు మద్దతు పలికింది.
గీతారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోదండ వెంటనే తన మాటలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. లేదంటే ఆయనను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. డిసెంబరులో సామాజిక న్యాయం అజెండాగా నూతన పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు. కాంగ్రెసును ఒంటరి చేస్తేనే తెలంగాణ సాధ్యమన్నారు. చంద్రబాబును తెలంగాణలో అడ్డుకోవాలనుకోవడం సరికాదన్నారు.
కాగా గీతారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కోదండరాంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలోని జహీరాబాద్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసును పురస్కరించుకుని పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైంది. తెలంగాణాకోసం మంత్రి గీతా రెడ్డి కదలి రావడంలేదని ఆక్షేపించడంలో భాగంగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండడంతో వివాదం చెలరేగింది.
తన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదని కోదండరాం ఆక్షేపిస్తే, మంత్రి గీతా రెడ్డికి కోదండరాం చేసిన వ్యాఖ్యల సిడిలు కూడా ఆందడంతో ఆమె వాటిని చూసి తీవ్రంగా స్పదించారు. కోదండరాం రెడ్డి అంటూ, చదువుకున్న వ్యక్తి, చదువు చెప్పవలసిన వ్యక్తి మాట్లాడే పద్ధతి ఇదేనా అని కూడా ఆమె ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కోదండరాంపై కేసు నమోదు అయ్యింది.