శివాజీ పార్క్లో థాకరే అంత్యక్రియలు: రోదించిన ఉద్దవ్
ముంబయి: శివసేన అధినేత బాల్ థాకరే మృతదేహానికి సాయంత్రం ఆరు గంటలకు దహన సంస్కారాలు చేస్తారు. సందర్శన కోసం శివాజీ పార్కులో థాకరే మృతదేహాన్ని ఉంచారు. అభిమానుల తాకిడితో శివాజీ పార్కు కిక్కిరిసి పోయింది. ముంబయి రోడ్లు కూడా జనసంద్రమయ్యాయి. శివాజీ పార్కుకు భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ తదితరులు చేరుకున్నారు.
బాల్ థాకరేను చూసేందుకు లక్షలాదిగా అభిమానులు తరలి వచ్చారు. థాకరే అంతిమయాత్రలో దాదాపు 20 లక్షల మంది హాజరయ్యారు. శివాజీ పార్క్కు కూడా లక్షలాది మంది చేరుకున్నారు. ఆయన తనయుడు ఉద్దవ్ థాకరే వెక్కి వెక్కి ఏడ్చారు. థాకరే స్థాపించిన ఆంగ్ల పత్రిక సామ్నా, హిందీ పత్రిక దోపహార్ సామ్నాలు సంతాపం ప్రకటించాయి. జాకెట్ పేజీలు, కవర్ పేజీలు కూడా పూర్తి నలుపులో ప్రచురించి ఆ పత్రికలు తమ విచారాన్ని వ్యక్తం చేశాయి. రెండు కవర్ పేజీలు పూర్తి నలుపు రంగులో ప్రచురించడం పత్రిక చరిత్రలో ఇదే తొలిసారి.
జాకెట్ కవర్ పేజీ పైన థాకరే నవ్వుతున్న ఫోటో పెద్దది ప్రచురించారు. మా యజమాని వెళ్లిపోయారని రాశారు. కింద పరాఠీలో ఒక చిన్న కవితను ప్రచురించారు. దోపహార్ సామ్నా ఆదివారం సాధారణంగా పని చేయదు. అలాంటిది ఈ రోజు థాకరేపై ప్రత్యేక సంచికను తీసుకు వచ్చింది. కాగా థాకరేను శివాజీ పార్కుకు ఆయన ఇళ్లు మాతోశ్రీ నుండి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. థాకరే అంత్యక్రియలకు నామా నాగేశ్వర రావు హాజరయ్యారు.