నిజాం ఆస్తుల రగడ: కోర్టుకెక్కుతానని నీలోఫర్
తాజాగా ప్రిన్సెస్ నీలోఫర్ న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నారు. ఎనిమిదో నిజాం ప్రిన్స్ ముఖరంజా 1990 ఆగస్టులో పెళ్లి చేసుకున్న మనోలియ ఒనర్ కూతురు ప్రిన్సెస్ నిలోఫర్ (21). తన తండ్రి నుంచి వారసత్వంగా రావలిసిన ఆస్తిని రాబట్టుకునేందుకు ఇస్తాంబుల్ నుంచి నగరానికి చేరుకుంది. మూడేళ్ల పాటు కాపురం చేసిన ప్రిన్సెస్ మనోలియా (మూడవ భార్య) కు 1993లో ప్రిన్స్ ముఖరంజా స్విర్జర్లాండ్ జెనీవా లో విడాకులు ఇచ్చారు.
అప్పుడే హైదరాబాదులోని చిరాన్ ప్యాలెస్ ను నిలోఫర్కు కానుకగా అందిస్తున్నట్టు ప్రకటించారు. నిజాం కుటుంబంలోని ఇతర సభ్యులకు మాదిరిగానే ప్రిన్సెస్ నీలోఫర్ చదువుతో పాటు ఉన్నతంగా జీవించేందుకు అవసరమైన సంపదను సమకూర్చుతున్నట్టు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ తర్వాత పరిణామాలతో ప్రిన్సెస్ మనోలియ ఒనర్ తన భర్త ముఖరంజా నుంచి భరణంగా రావలిసిన ఆస్తులను రాబట్టుకునేందుకు హైదరాబాద్లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీంతో చిరాన్ ఫోర్టు ప్యాలెస్తో పాటుకొంత ఆస్తిని అందించాలని కోర్టు ముఖరంజాను ఆదేశించింది. అందుకు ముఖరంజా అంగీకరించారు.
కాగా అంతకు ముందుగానే నిజాం ట్రస్ట్ పరిధిలోని ఆస్తి పాస్తుల లావాదేవీల నిర్వహణ బాధ్యతలు ముఖరంజా మొదటి భార్య ప్రిన్సెస్ ఇస్రా బెర్గిన్కు జీపీఏ అప్పగించటంతో ఆమె అప్పీలుకు వెళ్లటంతో ఆస్తుల పంపిణీ సమస్య మొదటికొచ్చింది. దీంతో ప్రిన్సెస్ మనోలియ ఒనర్ తన భర్త ముఖరంజా నుంచి భరణంగా రావలిసిన ఆస్తులను రాబట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. మైనర్గా ఉండడంతో ఆమె కూతురు ప్రిన్సెస్ నిలోఫర్కు తండ్రి ముఖరంజా రాసి ఇచ్చిన చిరాన్ పోర్టు ప్యాలెస్ ను జీపీఏ హోల్డర్గా ప్రిన్సెస్ ఇస్రా బెర్గిన్ స్వాధీనంలో ఉంది.
మేజర్ అయినందున తనకు తండ్రి నుంచి వారసత్వంగా దక్కవలిసిన ఆస్తులను అప్పగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించేందుకు సన్నహాలు చేస్తున్నారు. టర్కీలో పబ్లిక్ రిలేషన్స్ కోర్సును అభ్యసిస్తున్న నీలోఫర్ మరో ఏడాది కాలంలో చదువు పూర్తి చేసుకుని తండ్రి నుంచి వారసత్వంగా రావలిసిన ఆస్తి పాస్తులను పూర్తి స్థాయిలో రాబట్టుకునేందుకు న్యాయపోరాటానికి సిద్దమవుతున్నట్టు ప్రకటించారు.