సోనియాను దేవత అన్లేదు: కోమటిరెడ్డి, జగన్వైపే గుత్తా
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరితే తెలంగాణవాదులు లేకపోతే తెలంగాణ ద్రోహులు అవుతారా అని కోమటిరెడ్డి టిఆర్ఎస్ను ప్రశ్నించారు. డిసెంబర్ 9 లోగా తెలంగాణపై ప్రకటన చేయాలని, లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను ఓ చానల్ వక్రీకరించిందని చెప్పారు. తనను తెలంగాణ ద్రోహులు అంటే తెలంగాణ ప్రజలు సమర్థించరన్నారు.
తాను తెలంగాణవాదానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. తెలంగాణవాదం కెసిఆర్ సొత్తు కాదన్నారు. తామంతా తెలంగాణ కోసమే ఉద్యమాలు చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 9న ప్రకటన చేయకపోతే కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి తదితరులతో కలిసి ఓ నిర్ణయానికి వస్తానని చెప్పారు.
జిల్లాలో ఏ నాయకుడూ చేయని అభివృద్ధిని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేశారని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శ్రీశైల సొరంగ మార్గం, ఉదయ సముద్రం ప్రాజెక్టులు అందించిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిదే అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణపై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఎంపీలమంతా చర్చించి ఓ నిర్ణయానికి వస్తామన్నారు. గుత్తా జగన్ పార్టీలో చేరే అవకాశాలు ఆయన మాటల ద్వారా అర్థమవుతోందంటున్నారు.
కాగా తనతో ఏ నాయకుడు ఫ్రంట్ విషయమై చర్చించలేదని మంత్రి జానా రెడ్డి అన్నారు. ఫ్రంట్ కేవలం ఊహాగానాలే అన్నారు.