బాబాయ్ ముందు జాగ్రత్త: అబ్బాయ్ ఎన్టీఆర్ రాజీ
బాలకృష్ణ ముందు జాగ్రత్తగానే ప్రకటన చేసినట్లు కనిపిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ తాను రాజీకి వచ్చానని చెప్పడానికి ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. తాను శాసనసభకే పోటీ చేస్తానని చెప్పడం ద్వారా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆయన ఓ సంకేతం ఇవ్వదలుచుకున్నట్లు చెబుతున్నారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండదలుచకున్నానని ఆయన ఆ రూపంలో చెప్పారని అంటున్నారు.
అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణను పోటీకి దించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తనను లోకసభకు పోటీ చేయాలని ముఖాముఖి చంద్రబాబు అడిగే అవకాశాన్ని ఇవ్వకూడదనేది బాలయ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. తాను లోకసభకు పోటీ చేయబోనని, శాసనసభకే పోటీ చేస్తానని ముందే చెప్పానని తప్పించుకోవడానికి వీలుంటుందని భావించి ఆయన మాట్లాడి ఉంటారని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలకు తాను దూరం కాదలుచుకోలేదని కూడా బాలకృష్ణ చెప్పినట్లయింది.
నారా లోకేష్ రాజకీయ ప్రవేశం విషయంలో వారసత్వ పోరుకు దిగి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు దూరమయ్యారంటూ వార్తలు వచ్చాయి. ఆళ్ల నాని పార్టీ మారడంపై, వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను కలవడంపై జూనియర్ ఎన్టీఆర్ మీద పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. చంద్రబాబుకు, జూనియర్ ఎన్టీఆర్కు మధ్య పూర్తిగా చెడినట్లేనని వార్తలు వచ్చాయి.
అయితే, తెలుగుదేశం పార్టీకి దూరమైతే జరిగే నష్టాన్ని గ్రహించిన జూనియర్ ఎన్టీఆర్ రాజీకి వచ్చేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. బాలకృష్ణకు, చంద్రబాబుకు దగ్గర కావాలని ఆయన అనుకుంటున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఆయన శుక్రవారం ప్రకటన చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మీతోనే ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు, బాలకృష్ణకు తన ప్రకటన ద్వారా సందేశం పంపినట్లు భావిస్తున్నారు.