రెబల్స్ తో బీజేపీ 'గేమ్' కు మమతా చెక్, సంచలన నిర్ణయం...!!
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం లోకి వచ్చింది. మమతా బెనర్జీ పార్టీ 80 సీట్లకే పరిమితం అయింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తరువాత మమతను పూర్తిగా రాజకీయంగా బలహీన పర్చే విధంగా బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది. మమత పార్టీ కి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఆమె నాయకత్వానికి వ్యతిరేకంగా చీలక వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సమయంలోనే మమతా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
ఎన్నికల్లో ఓటమి తరువాత మమతా నాయకత్వానికి.. సమర్ధతకు పరీక్ష మొదలైంది. పార్టీలోని సొంత నేతలే విభేదిస్తున్నారు. ఎంపీలు.. ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారారు. మమత నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ మద్దతుతోనే వీరు అడుగులు వేస్తున్నారనే వాదన బలంగా ఉంది. అసెంబ్లీలో తిరుగుబాటును టీఎంసీ ఎదుర్కొంటోంది. టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పార్టీకి చెందిన 57 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. స్పీకర్ రతీంద్ర బోస్ కూడా ఈ నియామకాన్ని గుర్తించారు. అటు ఎంపీలు దాదాపు 20 మంది మమత ను ధిక్కరించి.. బీజేపీకి దగ్గర అవుతున్నారు. ఈ సమయంలో మమతా లోక్సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. బహరాంపుర్ లోక్సభ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పార్లమెంట్ లో బీజేపీని ఎదుర్కొనే వ్యూహం
సిట్టింగ్ ఎంపీ యూసఫ్ పఠాన్ ను రాజీనామా చేసి మమత పోటీకి మార్గం సుగమం చేయాలని కోరనున్నట్టు తెలుస్తోంది. 2011 ప్రపంచ కప్ విన్నింగ్ స్క్వాడ్లో ఒకరైన భారత మాజీ క్రికెటర్ పఠాన్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో బహరాంపుర్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అధీర్ రంజన్ చౌదరిపై 85,000 ఓట్ల ఆధిక్యంతో పఠాన్ గెలుపొందారు. మమతా బెనర్జీ గతంలోనూ లోక్సభ సభ్యురాలిగా ఉన్నారు. కోల్కతా సౌత్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. అయితే తొలి ఎన్నిక మాత్రం జాదవ్పుర్ నియోజకవర్గం నుంచి సీపీఐ అగ్రనేత సోమనాథ్ ఛటర్జీపై పోటీ చేసి గెలుపొందారు. 2011లో బెంగాల్ అసెంబ్లీకి వెళ్లేంతవరకూ లోక్సభ సభ్యురాలిగానే ఆమె ఉన్నారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించింది. కాగా, ఇటీవల కాలంలో పార్టీ నాయకత్వం పనితీరుపై లోక్సభ టీఎంసీ సీనియర్ ఎంపీల్లో అసమ్మతి తలెత్తెది. కొందరు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో ముందుగా లోక్సభలో అసమ్మతికి కళ్లెం వేసేందుకు దిగువ సభలో అడుగుపెట్టాలనే ఆలోచనలో మమతా బెనర్జీ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.













Click it and Unblock the Notifications