పీకల్లోతు కూరుకున్న తృణమూల్: మరో బిగ్ షాట్ డౌన్
పశ్చిమ బెంగాల్ లో అధికార మార్పిడి అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి వరుస షాకులను ఇస్తోందక్కడి ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయక్కడ. ఇప్పటికే పార్టీ రెండుగా చీలింది. చీలికపక్ష నాయకుడు ఏకంగా ప్రతిపక్ష నేతగా ఎన్నిక సైతం కావడం మింగుడుపడట్లేదు.
ఈ పరిణామాల మధ్య తృణమూల్ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధినాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా, కీలక నేతగా ఉన్న హకీమ్ వైదొలగడం భూకంపం పుట్టించినట్టయింది. తన రాజీనామా లేఖను మమతా బెనర్జీకి పంపించారు. దీన్ని ఆమె ఆమోదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వాస్తవానికి- అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారాయని, విధులు నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని హకీమ్ గతంలోనే వెల్లడించారు. తన రాజీనామా చేయాలనుకుంటున్నాననీ ప్రకటించారు. అప్పట్లో పార్టీ అగ్రనాయకత్వం ఆయనను బుజ్జగించింది. పదవిలో కొనసాగాలని కోరింది. అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఆయన మళ్లీ అదే అభ్యర్థన చేయడంతో మమత ఆమోదించారని టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ మీడియాకు వివరించారు.
గతంలో మాదిరిగా తాను సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించలేకపోతున్నానని హకీమ్ వివరించారు. మునుపటిలా పని చేయలేకపోతున్నానని, అందుకే మేయర్ పదవికి గౌరవం ఇవ్వడం కోసమే తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. తన వారసుడికి శుభాకాంక్షలు తెలియజేస్తోన్నానని పేర్కొన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫిర్హాద్ హకీమ్, 2018 నవంబర్ లో మొదటిసారిగా కోల్కతా మేయర్గా బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కోల్కతాకు మొట్టమొదటి ముస్లిం మేయర్ ఆయనే.
కాగా ఇటీవల నబన్నాలో ముఖ్యమంత్రి సువేందు అధికారి నిర్వహించిన పరిపాలనా సమీక్ష సమావేశానికి, హకీమ్ హాజరు కావడం రాజకీయ చర్చలకు దారితీసింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా భావించే నయన బందోపాధ్యాయ, అశోక్ దేబ్, కునాల్ ఘోష్ వంటి సీనియర్ టీఎంసీ నాయకులు కూడా ఈ భేటీలో పాల్గొనడం, పార్టీలో మారుతున్న సమీకరణాలను స్పష్టం చేసింది.
1998లో పార్టీ ఆవిర్భవించిన తర్వాత టీఎంసీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఇదే. 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 60 మంది తిరుగుబాటు చేశారు. రితబత్ర బెనర్జీని అసెంబ్లీ స్పీకర్ ప్రతిపక్ష నేతగా గుర్తించడం పార్టీలో చిచ్చును మరింత రగిలించింది. ప్రతిపక్ష నేత పదవి కోసం సమర్పించిన పత్రాలపై తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ రిాతబత్ర, సందీప్ సాహాలు చేసిన ఆరోపణలు, శోభన్దేవ్ ఛటోపాధ్యాయ ప్రతిపాదన విఫలం కావడం సంక్షోభం పతాక స్థాయికి చేరినట్టయింది.












Click it and Unblock the Notifications