జగన్ వక్రీకరించారు: సిబిఐ, కోర్టుకు భారతి, సాయిరెడ్డి
వైయస్ జగన్ బెయిల్ మంజూరుకు అనర్హుడని సిబిఐ అభిప్రాయపడింది. వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తునకు తమకు ఇంకా కొంత సమయం పడుతుందని, ఏడు అంశాలపై దర్యాప్తు సాగుతోందని చెప్పింది. దర్యాప్తు పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేయడానికి తమకు ఇంకా సమయం ఉందని సిబిఐ చెప్పింది. జగన్కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తాడని, సాక్షులను ప్రభావితం చేస్తాడని అభిప్రాయపడింది.
కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, జగన్ బెయిల్ పిటిషన్ వేశాడని చెప్పింది. కొన్ని నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పింది. సిబిఐ కౌంటర్ దాఖలు చేయడంతో జగన్ బెయిల్ పిటిషన్పై శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో వాదనలు ప్రారంభమై ముగిశాయి. కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా జగన్ సతీమణి భారతి, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి కోర్టుకు వచ్చారు.
బెయిల్ కోసం వైయస్ జగన్ ఇటీవల సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. కౌంటర్ దాఖలు చేయడానికి గడువు అడిగిన సిబిఐ శుక్రవారం దాన్ని దాఖలు చేసింది. సుప్రీంకోర్టు జగన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన విషయాన్ని, సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ వెల్లడించిన విషయాలను సిబిఐ కోర్టుకు వివరించింది.