టక్కుటమారాలతో బురిడీ: కెసిఆర్పై కొండా సురేఖ
దొంగ బాబాలకు, స్వాములకూ కెసిఆర్కూ మధ్య తేడా లేదని అన్నారు. ఏం సాధించారని సూర్యాపేట సభ పెడుతున్నారని ఆమె కెసిఆర్ను అడిగారు. చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కెసిఆర్ ఆ సభను నిర్వహిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ సెంటిమెంటు పేరుతో కెసిఆర్ గత 11 ఏళ్లుగా అమాయకమైన తెలంగాణ ప్రజలను కెసిఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు.
నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వస్తే ఒక రకంగా, తెరాసలోకి వస్తే మరో రకంగా కెసిఆర్ వ్యాఖ్యానించడం విడ్డూరమని ఆమె అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో తెరాస పొత్తు పెట్టుకుందని, బిజెపితో స్నేహానికి కెసిఆర్ ప్రయత్నించారని, అటువంటి తెరాసకు ఓ సిద్ధాంతం ఉందా అని అన్నారు. తెరాస ఉద్యమ పార్టీ కాదని, రాజకీయ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. తెలంగాణ రావాలని కెసిఆర్కు లేదని ఆమె అన్నారు. కెసిఆర్కా కావాల్సింది ప్యాకేజీలే అని, ఆ ప్యాకేజీ కుదరకనే బయటకు వచ్చారని సురేఖ విమర్శించారు.
పార్టీని బలోపేతం చేసుకోవడానికి సూర్యాపేట సభను పెడుతున్నారని ఆమె కెసిఆర్పై మండిపడ్డారు. 610 జీవోపై సమైక్యవాదాన్ని వినిపించింది కెసిఆర్ కాదా అని ఆమె అడిగారు. తెలంగాణ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో కెసిఆర్ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు కూడా విరుచుకుపడ్డారు. కెసిఆర్ స్వప్రయోజనాల కోసం తెలంగాణవాదాన్ని వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణవాదాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి, కాంగ్రెసు పార్టీకి కెసిఆర్ అమ్ముడుపోయారని ఆయన ఆరోపించారు. కెసిఆర్, కోదండరామ్ వైఖరి దొరల పాలనకు నిదర్శమని వ్యాఖ్యానించారు. తెలంగాణపై కెసిఆర్ వైఖరిని నిరసిస్తూ ఆదివారం హైదరాబాదులోని గన్ పార్కు వద్ద తాను ఒక్క రోజు దీక్షను చేపడుతానని ఆయన నల్లగొండ జిల్లాలో చెప్పారు.
ఇదిలావుంటే, కెసిఆర్కు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్కు 19 ప్రశ్నలు సంధిస్తూ తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి ఓ బహిరంగ లేఖ రాసింది. కోదండరామ్ ఉద్యమాన్ని వదిలేసి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారని జెఎసి నాయకుడు గజ్జెల కాంతం హైదరాబాదులో విమర్శించారు. కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుని కెసిఆర్ ఉచితంగా భూమిని పొందారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ తన ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. పదవులు, ప్రచారం కెసిఆర్ కుటుంబానికేనా అని ఆయన అడిగారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కెసిఆర్ తెలంగాణ రావుల సమితిగా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు.