కెసిఆర్కు ఇదే నా సవాల్, రావాల్సిందే: మందకృష్ణ
ఉద్యమాల పేరుతో తెలంగాణ ప్రజలను అణువణువునా మోసం చేస్తున్న తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు బొంతపురుగు కన్నా హీనమైన వ్యక్తి అని మందకృష్ణ మాదిగ విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్ పార్శిగుట్ట రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు రాజెల్లయ్య మాదిగ, వంగపల్లి శ్రీనివాస్, వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రి గీతారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం బహిరంగ క్షమాపణ చెప్పారని, అయితే కోదండరాంను సమర్థించిన కేసీఆర్ను వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. ఆదివారం నాటి తెలంగాణ సమరభేరి సభలో కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్కు దళిత ముఖ్యమంత్రి పేరు ప్రకటించడం తెలియదా? అని మందకృష్ణ ప్రశ్నించారు.
గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ ఇప్పటివరకు పేరు ప్రకటించకపోవడం విడ్డూరమన్నారు. తెలంగాణలో కేసీఆర్ నిర్వహించిన చోటల్లా తాము బహిరంగ సభలు నిర్వహిస్తామని సవాల్ విసిరారు.
వృద్ధులు, వితంతువుల పింఛన్లు వేయి రూపాయలు పెంచనట్లయితే ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సంగతి తేలుస్తామని మందకృష్ణ హెచ్చరించారు. వచ్చే 17న హైదరాబాద్లో జరిగే సభలో ఈ సంగతి తేల్చుకుంటామన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు.