నాని: చేజారకుండా తొడగొట్టిన బాలకృష్ణ, గుడివాడ టు..
గుడివాడ నియోజకవర్గంలోనే సొంతూరు నిమ్మకూరు ఉంది. ఈ నియోజకవర్గంలో మొదటి నుండి టిడిపిదే పట్టు. జూనియర్ ఎన్టీఆర్కు సన్నిహితుడుగా ముద్రపడిన నియోజకవర్గం ఎమ్మెల్యే కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జై కొట్టడంతో ఇక్కడ ఎంతో కొంత టిడిపి నష్టపోతుంది. కొడాలి నాని వరుసగా రెండుసార్లు ఈ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా గెలుపొందాడు.
2004 నుండి అతడే టిడిపికి నియోజకవర్గంలో పెద్దదిక్కు, ఎమ్మెల్యే. ఈ తొమ్మిదేళ్లలో నాని నియోజకవర్గంలో తన పట్టును పెంచుకున్నాడు. టిడిపి క్యాడర్ మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా తను అనుచరులను తయారు చేసుకున్నాడు. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో అతను అనుచరులను తయారు చేసుకున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ టిడిపి ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు గుడివాడ నుండి పోటీ చేసేందుకు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
రావి గత కొన్నాళ్లుగా టిడిపికి దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో అతని పట్టు జారిపోయింది. దీంతో తిరిగి తన పట్టు సాధించుకునే ఉద్దేశ్యంలో భాగంగా బాలకృష్ణను నియోజకవర్గానికి రప్పించి... ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టేలా రావి చేశారని తెలుస్తోంది. బాలకృష్ణ వస్తే నియోజకవర్గం టిడిపిలో కొత్త ఉత్సాహం రావడంతో పాటు ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుందని రావి వర్గం భావించిందని అంటున్నారు.
అనుకున్నట్లుగానే గుడివాడకు వచ్చిన బాలకృష్ణ గతంలో కంటే విమర్శల్లో దూకుడు పెంచారని, ఆయన వ్యాఖ్యలు కేవలం గుడివాడ నియోజకవర్గంలో మాత్రమే కాకుండా మొత్తం టిడిపి క్యాడర్నే ఉత్సాహంలో నింపాయి. పార్టీ అధిష్టానంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే బుద్ధి చెబుతామని హెచ్చరించడం ద్వారా బాబును ఎవరైనా విమర్శిస్తే సహించేది లేదని బాలయ్య స్పష్టం చేశారు. తద్వారా తాను చంద్రబాబుకు అండగా నిలబడతారని చెప్పారు.
గ్లామర్ టచ్, హెచ్చరికలతో కూడిన ప్రచారంతో పార్టీ మారిన కొడాలి నాని వైపుకు క్యాడర్ చేజారకుండా బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టిడిపికి కంచుకోటగా ఉన్న గుడివాడలో మళ్లీ తమ పార్టీ అభ్యర్థి రావిని గెలిపించుకునేందుకు బాలయ్య ఓ వైపు గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. గుడివాడ టిడిపికి ప్రతిష్టాత్మకం కావడంతో అక్కడ ప్లస్ అయినా మైనస్ అయినా ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల శంఖారావం బాలయ్య గుడివాడ నుండే ప్రారంభించినట్లుగా ఆయన దూకుడును బట్టి అర్థమవుతోంది.