చిత్రాల్లో 'జయ'హో: రాజకీయాల్లో గాలి పటాలు
హైదరాబాద్: ఒకప్పుడు తెలుగు తెరను ఊపేసిన నటీమణులు జయప్రద, జయసుధ. వీరిద్దరూ సినిమాల్లో జయానికి ప్రతీకగా నిలిచారు. ఇటు గ్లామర్ పాత్రల్లోనూ, అటు మహిళా ప్రధాన్య పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. వారిద్దరూ ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. సినిమాల్లో అదరహో అనిపించిన వీరిద్దరూ రాజకీయాల్లో మాత్రం అష్ట కష్టాలు పడుతున్న సూచననలు కనిపిస్తున్నాయి.
జయసుధ, జయప్రద ఒకేసారి సినిమాల్లోకి ప్రవేశించారు. గ్లామర్ రోల్స్లోనే కాకుండా నటనకు అవకాశం ఉన్న పలు చిత్రాల్లో వారిద్దరు నటించారు.
మేఘ సందేశం సినిమాలో ఇరువురు భామామణుల్లో జయప్రద తన గ్లామర్తోనే కాకుండా నటనతోనూ అదరగొడితే, జయసుధ అమాయకమైన ఇల్లాలి పాత్రలో నటించి మెప్పించారు.
అడవి రాముడు వంటి మాస్ సినిమాలో ఎన్టీఆర్ సరసన జయప్రద, జయసుధ అందాలను ఆరబోయడమే కాకుండా పోటీ నటించారు.
జయసుధ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ప్రవేశించి, వెంటనే కాంగ్రెసు పార్టీ టికెట్ మీద సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ శానససభలోకి అడుగు పెట్టారు.
జయప్రద తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి, పోరాటాలు చేశారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా తన సత్తా చాటే ప్రయత్నం చేశారు. అందులో ఇమడలేక ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లి రాంపూర్ నుంచి పార్లమెంటుకు వెళ్లారు.
సమాజ్వాదీ పార్టీలో జయప్రద రాజకీయ జీవితమంతా అమర్ సింగ్ నీడ కిందనే సాగింది. ఆయన ఆ పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో ఆమెకు కూడా అదే పరిస్థితి ఎదురైంది.
జయసుధ అనుకోకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి, వాటి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలోనైనా ఉంటానో ఉండనో అనే వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చి ఏమీ చేయలేపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయప్రద మాత్రం ఇంకా రాజకీయాల్లో తన భవిష్యత్తును చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించి, పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న ఆమె ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నారు. ఆమెకు ఏ పార్టీ ఆహ్వానం పలుకుతుందనేది ఇంకా సందేహంగానే ఉంది.