కోల్డ్వార్: బాలకృష్ణ విజిట్, వల్లభనేని వంశీ డుమ్మా
బాలకృష్ణ పర్యటన సందర్భంగా గుడివాడ పార్టీ ఇంచార్జీ రిసెప్షన్కు విజయవాడ (అర్బన్) పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ హాజరు కాలేదు. ఆయన గైర్హాజరు కొట్టడంపై పార్టీలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. రావి వెంకటేశ్వర రావు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిన తర్వాత గుడివాడ పార్టీ ఇంచార్జీగా రావి వెంకటేశ్వర రావు నియమితులయ్యారు.
రిసెప్షన్కు ఎక్కువగా బాలకృష్ణకు సన్నిహితులైనవారే వచ్చారు. వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు ఈ కార్యక్రమానికి రాలేదు. వంశీ బాలకృష్ణ సోదరుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు సన్నిహితుడనే విషయం తెలిసిందే. పార్టీలో తమ తమ స్థానాలను పదిలపరుచుకునే క్రమంలో హరికృష్ణకు, బాలకృష్ణకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నట్లు ప్రచారంలో ఉంది.
వల్లభనేని వంశీ నందమూరి హరికృష్ణ కుమారుడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్కు కూడా సన్నిహితుడే. గతంలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ధిక్కరించిన వంశీ ఆ తర్వాత రాజీకి వచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో రోడ్డు మీద వంశీ మాట్లాడడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వర్గీయ ఎన్టీ రామారావు సొంత నియోజకవర్గం గుడివాడపై బాలకృష్ణ పట్టు సాధించి తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఆ సీటుపై ఆయన కన్నేశారని, అది హరికృష్ణకు నచ్చడం లేదని చెబుతున్నారు.