ఇద్దరుమిత్రులు:లగడపాటితో కెసిఆర్ షేక్హ్యాండ్,నవ్వులే
న్యూఢిల్లీ: రెండు వ్యతిరేక ధృవాలు. ఒకరి పేరు చెబితే ఒకరికి ఒళ్లు మండుతుంది. నోటికొచ్చినట్లుగా ఇరువురు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారు. వారు ఒకరు తెలంగాణ ఉద్యమ నేత అయితే మరొకరు గట్టి సమైక్యవాది. వారిద్దరూ న్యూఢిల్లీలో పార్లమెంటు లాబీల్లో నవ్వుతూ పలకరించుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్లు కరచాలనం చేసుకున్నారు.
పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సమావేశాలకు హాజరయ్యేందుకు కెసిఆర్, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు పార్లమెంటు లాబీలో కెసిఆర్, లగడపాటి ఎదురుపడ్డారు. ఆ సమయంలో వారిద్దరూ కరచాలనం చేసుకున్నారు. ఒకరికి మరొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వీరిద్దరి మధ్య తెలంగాణ ప్రస్తావన రాలేదు.
నవ్వూతూ ఓ నిమిషం పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ.. నువ్వు బాగుంటావు, తెలుగు ప్రజలు బాగుంటారు, అందరూ బాగుంటారని అన్నారట. కెసిఆర్ కూడా అందరూ బాగా ఉంటారని చెప్పారట. అయితే రెండు భిన్న ధృవాలు ఆత్మీయ స్నేహితుల్లాగా మాట్లాడుకోవడం గమనార్హం.
పత్రికాముఖంగా వీరిద్దరు ఎంతగా విమర్శలు చేసుకున్నప్పటికీ రెండుమూడుసార్లు ఒకరిని ఒకరు ఆప్యాయంగానే పలకరించుకున్నారు. కాగా పార్లమెంటు లాబీల్లో కలుసుకున్న అనంతరం కెసిఆర్ కారెక్కి తన ఇంటికి వెళ్లగా... లగడపాటి హౌస్ లోపలకు వెళ్లారు. వీరిద్దరూ కరచాలనం చేసుకొని, ఆత్మీయంగా ఓ నిమిషం పాటు మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది.