మీడియా: సాక్షి ఆంగ్లం పోర్టల్, లెఫ్ట్ టీవీ చానెళ్లు
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే వైయస్ జగన్ సాక్షి దినపత్రికను, టీవీ చానెల్ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న రామోజీరావు దినపత్రిక ఈనాడు, వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయంటూ వైయస్ రాజశేఖర రెడ్డి నిరంతరం విరుచుకపడేవారు. వాటికి పోటీగా జగన్ సాక్షి మీడియా పురుడు పోసుకుంది. నిజానికి, రాజకీయ ఆధిపత్యానికి మీడియాను ఓ సంకేతంగా భావిస్తున్నారు.
ఆ రెండు పత్రిలకు, సాక్షికి మధ్య నిరంతరం పోరు సాగుతూనే ఉన్నది. ఈనాడుకు గానీ, ఆంధ్రజ్యోతికి గానీ తెలుగుదేశం పార్టీతో ప్రత్యక్ష అనుబంధం లేదు. అయినా సరే, ఆ పత్రికలకు తెలుగుదేశం అనుకూల ముద్ర పడింది. ఇక వామపక్షాలకు వేర్వేరు పత్రికలు ఉన్నాయి. అవి రాజకీయాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిన సందర్భాలు తక్కువే. సిపిఎంకు ప్రజాశక్తి దినపత్రిక ఉండగా, సిపిఐకి విశాలాంధ్ర ఉంది. ఇటీవలి కాలంలో ఈ పత్రికలు కూడా విస్తరించాయి.
రెండు వామపక్షాలు కూడా ఇప్పుడు టీవీ చానెళ్లను ప్రారంభించే పనిలో బిజీగా ఉన్నాయి. సిపిఎం టీవీ10 పేరు మీద ఓ న్యూస్ చానెల్ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంది. అదే విధంగా, సిపిఐ టీవీ99 పేరు మీద న్యూస్ చానెల్ను ఏర్పాటు చేసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా టీవీ చానెళ్లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో సివిఆర్, వి6 టీవీ న్యూస్ చానెళ్లు వెలిశాయి. హెచ్ఎంటీవీ చానెల్ కూడా ఉంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయక ముందే ఓ టీవీ చానెల్ పెట్టడానికి ప్రస్తుత కేంద్ర మంత్రి చిరంజీవి ఓ టీవీ చానెల్ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితికి టీన్యూస్ అనే న్యూస్ చానెల్, నమస్తే తెలంగాణ అనే దినపత్రిక ఉన్నాయి. అంతకు ముందు, ఈనాడు, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెళ్లతో పాటు టీవీ9, ఎన్టీవి, మాటీవీ, జీ 24 గంటలు, టీవీ5 వంటి న్యూస్ చానెళ్లు ఉన్నాయి. కాంగ్రెసు పార్టీకి మాత్రం ఏ టీవీ చానెళ్లు, పత్రికలు లేవు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే గుర్తు చేస్తున్నారు. అయితే, ఆంధ్రభూమి తెలుగు దినపత్రిక, దక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ దినపత్రిక కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తాయని అంటారు. మొత్తం మీద, టీవీ చానెళ్లతో హోరెత్తబోతోంది.